తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తాజాగా ప్రతిపక్ష ప్యానెల్పై, నిర్మాత అశోక్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి పదవులు కావాల్సింది పరిశ్రమను ఉద్ధరించడానికి కాదని, కేవలం ముఖ్యమంత్రుల పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి, ప్రజల ముందు షో చేయడానికేనంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అశోక్ కుమార్ నామినేషన్ వ్యవహారంపై చదలవాడ క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. తమ ప్యానెల్ ఎంతో హుందాగా ఎన్నికల బరిలో ముందుకు వెళ్తుంటే.. అశోక్ కుమార్ కావాలనే ప్రెస్ మీట్ పెట్టి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఒత్తిడి వల్లే ఆయన నామినేషన్ వెనక్కి తీసుకునేలా చేశామని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కడాన్ని చదలవాడ తప్పుబట్టారు. “అసలు నిజం ఏంటంటే.. అశోక్ కుమార్కు కనీస అనుభవం లేక ఒకేసారి మూడు నామినేషన్లు వేశారు. వారి ప్యానెల్ లోని ఇతరులు కూడా ఇలాగే ఎక్కువ నామినేషన్లు వేసినా, సమయానికి విత్ డ్రా చేసుకోవడంతో పోటీకి అర్హత సాధించారు. కానీ, అశోక్ కుమార్ విత్ డ్రా చేసుకోకపోవడం వల్లే నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ అనర్హతకు గురైంది. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఆయన వెంటనే ఇండస్ట్రీకి గౌరవం ఇస్తూ తన మాటలను వెనక్కి తీసుకోవాలి” అని చదలవాడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాత కష్టం అచ్చం పొలంలో కష్టపడే రైతు లాంటిదని ఆయన అభివర్ణించారు. రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ పోటీ చేస్తున్న తమ ప్యానెల్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్ వల్ల పరిశ్రమకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించిన చదలవాడ.. “వాళ్లకు పదవులు కావాల్సింది నిర్మాతల సమస్యలు పరిష్కరించడానికి కాదు.. కేవలం ముఖ్యమంత్రులకు, ప్రజలకు కనిపించి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే” అని ఘాటుగా విమర్శించారు. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి ఆశయాలను, అడుగుజాడలను తాము అనుసరిస్తున్నామని చదలవాడ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలుస్తున్న బండ్ల గణేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి అండగా నిలిచి, అద్భుతమైన పరిపాలన అందించే సత్తా ఉన్న తమ ప్యానెల్కే ఓటు వేసి గెలిపించాలని ఆయన నిర్మాతలందరినీ కోరారు.

