తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ‘మన ప్యానెల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రత్యర్థి వర్గమైన గిల్డ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కౌన్సిల్కు గండి కొట్టి, ఆ సొమ్మును గిల్డ్కు తీసుకువెళ్లి ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేద నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బును గిల్డ్ సభ్యులు తమలో తామే పంచుకుని, చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. గిల్డ్ వారు కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని, ఒకవేళ తమ ప్యానెల్ దుర్వినియోగం చేసిందని ఎవరైనా నిరూపిస్తే తాను వెంటనే ఎన్నికల నుంచి తప్పుకుంటానని, తమపై చిన్న మచ్చ (బ్లాక్ డాట్) చూపించినా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని సి.కళ్యాణ్ సవాల్ విసిరారు. వారు సంస్థను పూర్తిగా వాడుకుంటున్నారని, వారి మధ్య ఐక్యత ఉండదని ఆయన విమర్శించారు.
గత రెండున్నరేళ్లుగా అధికారంలో ఉండి నిర్మాతలకు ఎలాంటి సహాయం చేయని వారు, ఎన్నికల సమయం రాగానే హామీలు, వాగ్దానాలు చేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. తమ ప్యానెల్ లో కేవలం 7 మంది ఉంటే, వారి ప్యానెల్ లో 16 మంది ఉన్నారని, అయినా వారు సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పరిశ్రమలో ఏడాదికి 300 చిన్న సినిమాలు వస్తున్నాయని, వాటిపై ఆధారపడి 40 వేల మంది బతుకుతున్నారని, అలాంటి చిన్న నిర్మాతల కోసం, వారిని ఆదుకోవడం కోసమే ‘మన ప్యానెల్’ ఉందని స్పష్టం చేశారు. నిర్మాతల మండలి అనేది ఒక ఛారిటీ లాంటిదని, దానికి జరిగిన అన్యాయం గురించి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లెయిమ్ వచ్చేలా చేసింది తామేనని గుర్తు చేసిన సి.కళ్యాణ్, ఎన్నికల తర్వాత ప్రెసిడెంట్గా అందరితో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు.

