టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ సామాజిక, రాజకీయ అంశాలపై ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల పనితీరు, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఆయన వేసిన ట్వీట్లు నెట్టింట వైరల్గా మారాయి.
తన ట్వీట్లో రాహుల్ రామకృష్ణ పేర్కొంటూ.. “పవన్ కళ్యాణ్ గారు.. మీ గొప్పలు, ఆర్భాటాలు పక్కన పెడితే.. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ( సమాచార హక్కు చట్టం) కింద మీరు నిర్వహించే శాఖల్లోని ప్రతీ విభాగంలో సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని మీ శాఖల్లో అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. మీరు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అని రాసుకొచ్చారు.
అంతటితో ఆగకుండా గిరిజన ప్రాంతాల్లోని చట్టాల అమలుపై కూడా రాహుల్ ప్రశ్నలు గుప్పిస్తూ.. “PESA (పెసా) చట్టం, 1/70 చట్టం, గ్రామసభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి చూపించండి. అలాగే మీరు చేసినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలు కూడా చెప్పండి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల గురించే మిమ్మల్ని అడుగుతున్నాను” అని నిలదీస్తూ ట్వీట్ ముగింపులో ఆయన ‘జై తెలంగాణ’ అని నినదించడం విశేషం. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల నుంచి ఎదురయ్యే ట్రోలింగ్ను ముందుగానే ఊహించిన రాహుల్ రామకృష్ణ.. ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను’ అని ట్వీట్ చేయడం కొసమెరుపు.
@PawanKalyan please ask and show for results for the implementation of PESA, 1/70 Act, Grama Sabha Act. The afforestation programs, did you do them? numbers seem dubious as verified by an independent body
I’m asking for filed and marked resultsJai Telangana!
— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026

