Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!

Ajay Bhupathi

Ajay Bhupathi

Ajay Bhupathi: డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ చిత్రాలు ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఒప్పుకున్నారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘మంగళవారం’ సినిమా తర్వాత తాను ‘మంగళవారం 2’ కథపై పూర్తిగా దృష్టి పెట్టానని తెలిపారు. అయితే నిర్మాత జెమినీ కిరణ్‌తో చాలా కాలం క్రితమే సినిమా చేయాల్సి ఉండటంతో, ఆయన ఇచ్చిన అడ్వాన్స్ కూడా తన వద్ద ఉండిపోయిందని చెప్పారు. అదే సమయంలో జై కృష్ణను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనతో నిర్మాత తనను సంప్రదించారని వెల్లడించారు. మొదట్లో కొత్త హీరో లాంచ్ సినిమా చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పిన అజయ్ భూపతి, తర్వాత అశ్వినీ దత్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుందనే విషయం తెలుసుకుని ఆలోచన మార్చుకున్నట్లు తెలిపారు. అనంతరం కృష్ణ కుటుంబాన్ని కలిసి, జై కృష్ణను వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకం కలిగిందని చెప్పారు.

ఆయన జై కృష్ణ గురించి మాట్లాడుతూ.. అతనికి సినిమాలపై మంచి అవగాహన ఉందని, కథలు, పాత్రలపై స్పష్టమైన క్లారిటీ ఉందని ప్రశంసించారు. “నెపోటిజం ఉన్నవాళ్లకు అవకాశాలు రావచ్చు. కానీ నటుడిగా నిలబడాలంటే ప్రతిభ, కష్టపడే తత్వం మాత్రం ప్రతి ఒక్కరికీ ఒకేలా అవసరం. జై కృష్ణలో ఆ కమిట్‌మెంట్ కనిపించింది. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను” అని అజయ్ భూపతి అన్నారు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ తన గత చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందని తెలిపారు. ఇది కమర్షియల్ లవ్ స్టోరీ అయినప్పటికీ, బలమైన భావోద్వేగాలు, ట్విస్టులు, అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. సినిమా మొత్తం సహజమైన లొకేషన్లలో చిత్రీకరించామని, కొత్త అనుభూతిని అందించేలా ట్రీట్‌మెంట్ ఉంటుందని వెల్లడించారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘మంగళవారం 2’నే తన నెక్స్ట్ సినిమా అని స్పష్టం చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్, కథనం పరంగా ఈ సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు చెప్పి అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.