Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్‌లో శివాజీ బోల్డ్ కామెంట్స్!

Shivaji

Shivaji

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎపిక్’ (ఫస్ట్ సెమిస్టర్) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. ట్రైలర్‌లో వాడిన కొన్ని బోల్డ్ డైలాగ్స్‌పై ఓపెన్‌గా స్పందించడం సంచలనంగా మారింది. ఎపిక్ ట్రైలర్ చూసినప్పుడు అందులో వాడిన కొన్ని పదాల పట్ల తాను కూడా ఆశ్చర్యపోయానని శివాజీ కుండబద్దలు కొట్టారు. “మా ఓడు ఏంది ఇది.. ఇలాంటి పదాలు అవసరమా?” అని తనకు కూడా అనిపించిందని ఆయన అంగీకరించారు. అయితే, ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాకు గుర్తింపు రావాలన్నా, జనాల్లోకి బలంగా వెళ్లాలన్నా ఎక్కడో చోట ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ కచ్చితంగా ఉండాలని ఆయన ఆ డైలాగ్స్‌ను సమర్థించారు. ఆ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసమే డైరెక్టర్ ఆదిత్య అలాంటి పదాలను వాడాడని శివాజీ క్లారిటీ ఇచ్చారు.

సినిమా కథాంశంపై మాట్లాడుతూ.. జెన్-జీ (Gen Z), మిలీనియల్, ఆల్ఫా అనేవి కేవలం వెస్టర్న్ దేశాలు క్రియేట్ చేసిన మార్కెటింగ్ పదాలని, మనుషుల ఎమోషన్స్‌కు, వయసుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎపిక్ సినిమా కేవలం కుర్రకారుది మాత్రమే కాదని, థియేటర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ అని తెలిపారు. స్టూడెంట్స్ ఈ సినిమాలో వాళ్ల లవ్ స్టోరీని చూసుకుంటే, పేరెంట్స్ తమ కథను ఇందులో చూసుకుంటారని భరోసా ఇచ్చారు. సినిమాలో రెగ్యులర్ స్లాప్‌స్టిక్ కామెడీ కాకుండా, థియేటర్‌లో కూర్చున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా వినోదం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పోషించిన పాత్ర అత్యంత కష్టమైనదని శివాజీ ప్రశంసించారు. కేవలం కోప్పడటం, తిట్టడం, కొట్టడం సులువని, కానీ చిన్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్‌కు ఉన్న ప్రత్యేకమైన స్వభావాన్ని సినిమా ఆసాంతం ఎక్కడా డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేయడం ఆషామాషీ కాదన్నారు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య నటన గురించి చెబుతూ.. “జాగ్రత్త రాజా.. ఆ అమ్మాయి యాక్టింగ్‌తో తినేస్తుంది” అని ఆనంద్‌ను తాను ముందే హెచ్చరించినట్లు సరదాగా వ్యాఖ్యానించారు. గోరేటి వెంకన్న లాంటి దిగ్గజాలు రాసిన అద్భుతమైన పాటలు, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం అని శివాజీ కితాబిచ్చారు.