”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ ”రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. రక్తం సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం వెళ్లి కలిసినప్పుడు చిరంజీవి గారు చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మిస్తానని మాటిచ్చారు. గతంలోనూ మా సినీ కార్మికుల సమస్యల గురించి చాలా సేపు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. చిత్ర పరిశ్రమకు దాసరి గారు లేని లోటు చిరంజీవి గారు తీరుస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి మాటిచ్చిన చిరంజీవి గారికి మొత్తం సినీ కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు.
చిత్రపురి హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ”చిత్రపురి కాలనీలో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు శ్రీకాంత్ గారు రావడం చిరంజీవి గారు వచ్చినట్లే ఉంది. చిరంజీవి గారి ప్రియ సోదరుడు శ్రీకాంత్ గారు. సినీ కార్మికులన్నా, పేదలన్నా చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. సీసీసీ ద్వారా కరోనా కష్టకాలంలో ఆదుకున్నారు. చిరంజీవి గారు ఎంత పెద్ద స్టారో అంతే పెద్ద మనసున్న మనిషి” అని చెప్పారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ”చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, రమ్మని అనిల్ గారు అడగ్గానే తప్పకుండా వస్తానని చెప్పాను. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం. అలా పాల్గొంటే ఆ పుణ్యం నాకు కూడా కొంత వస్తుందని నమ్ముతాను. చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మిస్తానని మెగాస్టార్ చెప్పడం సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ సభ్యులు పీఎస్ఎన్ దొర, అళహరి, అనిత ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
