టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు.
కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. చిరంజీవి హీరోగా నటించిన సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన మృతికి చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను చిరంజీవి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని చిరంజీవి వారి కుటుంబానికి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా వెల్లడించారు.