Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా టీమ్ను అభినందించడమే కాకుండా, తన సినీ ప్రయాణం, అభిమానులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చెన్నై లవ్ స్టోరీ” అనే టైటిల్ వినగానే తనకు చెన్నై నగరంతో ఉన్న అనుబంధం గుర్తొచ్చిందని చెప్పారు. నటుడిగా ఎదగాలనే కలతో చెన్నై వీధుల్లో తిరిగిన రోజుల నుంచి, స్టార్ హీరోగా అదే నగరంలో ప్రయాణించిన క్షణాలు తన జీవితంలో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న యువ ప్రతిభ అని చిరంజీవి పేర్కొన్నారు. నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు రవి వర్మ వంటి వారు తన అభిమానులుగా ఇండస్ట్రీలోకి వచ్చి తమ ప్రతిభతో ఎదగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అభిమానులు కేవలం ప్రేమ చూపించడం మాత్రమే కాదు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుని తమ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగడమే నిజమైన అభిమానమని తెలిపారు.
ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన చిరంజీవి, ఒక ఫ్యాన్బాయ్గా ప్రారంభమైన ప్రయాణం నేడు విజయవంతమైన నిర్మాత స్థాయికి చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే సాయి రాజేష్ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగి జాతీయ అవార్డులు అందుకోవడం తనకు గర్వకారణమని కొనియాడారు. యువతకు చిరంజీవి కీలక సందేశం ఇచ్చారు. “కలలు కనండి… కానీ రాత్రిపూట కాదు, పగలే కనండి. ఆ కలలను నిజం చేయడానికి కష్టపడండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. అవమానాలు, అపజయాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది” అని సూచించారు. ఈ ఒక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు.
తాను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి మహానటులు ఉన్నప్పటికీ, తనపై నమ్మకంతో ముందుకు వచ్చానని గుర్తు చేశారు. “నేను కూడా ప్రత్యేకంగా ఏదో చేయగలను అనే విశ్వాసమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన ప్రతిభతో ప్రేక్షకుల ఆదరణ పొందిన యువ హీరోగా ప్రశంసించారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా కూడా కిరణ్ అబ్బవరంకు మరో విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. కొత్త తరం నటులు పరిశ్రమలోకి రావడం వల్లే తెలుగు సినిమా ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. హీరోయిన్ గౌరీ ప్రియకు చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అమ్మాయిగా అన్ని భాషల్లో తన ప్రతిభను చాటుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. అనంత శ్రీరామ్ రచనలను, మణిశర్మ సంగీతాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. తన కెరీర్లో ఎన్నో మరిచిపోలేని పాటలను అందించిన మణిశర్మకు కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకులే తన డ్యాన్స్ ప్రయాణానికి బలమని పేర్కొన్నారు. చివరగా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.

