2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ (#MeToo) ఉద్యమంలో భాగంగా.. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిలపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ధైర్యానికి ప్రతిఫలంగా తమిళ డబ్బింగ్ యూనియన్ ఆమెపై అన్యాయంగా నిషేధం (Ban) విధించింది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 2023లో విజయ్ ‘లియో’ సినిమాతో త్రిషకు డబ్బింగ్ చెప్పి రీ-ఎంట్రీ ఇచ్చిన చిన్మయి.. ఇప్పుడు ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమాలో త్రిష క్యారెక్టర్కు ప్రాణం పోశారు. అయితే ఈ ప్రయాణం ఆమెకు అంత సులువుగా సాగలేదు.
గత కొన్నేళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్న నిషేధాలు, ఆంక్షలపై మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి.. ‘ ‘కరుప్పు’ సినిమాలో త్రిష పాత్ర చాలా పవర్ఫుల్గా, ఎమోషనల్గా ఉంటుంది. డబ్బింగ్ స్టూడియోలో కూర్చుని కొన్ని ఎమోషనల్ సీన్లకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు.. నా పాత చేదు జ్ఞాపకాలు, గత కొన్నేళ్లుగా నాపై జరిగిన అన్యాయం, నన్ను మానసికంగా వేధించిన సంఘటనలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. దాంతో మైక్ ముందే నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.కేవలం తన హక్కుల కోసం, తోటి మహిళల భద్రత కోసం మాట్లాడినందుకు నా సొంత పరిశ్రమలోనే (కోలీవుడ్) ఒక అంటరానిదానిలా చూశారు. ఇప్పటికీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎన్నో లీగల్ అడ్డంకులను, ఆంక్షలను దాటుకుని రావాల్సి వస్తోంద’ అని పేర్కొంటూ.. ‘భవిష్యత్తులో ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండా నా సొంత పరిశ్రమలో నేను స్వేచ్ఛగా పనిచేసే రోజులు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిన్మయి రాసుకొచ్చారు.
