Chakrapani Jayanti : మరపురాని చక్రపాణి చమక్కు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chakrapani Jayanti : చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆయన నేతృత్వంలో వెలుగు చూసిన ‘యువ’ మాస పత్రిక సైతం పండితపామరులను అలరించింది. ఇక చిత్రసీమలోనూ చక్రపాణి బాణీ భలేగా సాగింది. ‘చెక్కన్న’గా సినీజనం అభిమానం సంపాదించిన చక్రపాణి మిత్రుడు బి.నాగిరెడ్డితో కలసి ‘విజయా సంస్థ’ను నెలకొల్పి, తెలుగువారు మరచిపోలేని చిత్రాలను అందించారు. ఆ రోజుల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోగా ‘విజయా-వాహినీ స్టూడియోస్’ను తీర్చిదిద్దడంలోనూ చక్రపాణి పాత్ర ఎంతో ఉంది.
చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. 1908 ఆగస్టు 5న తెనాలిలో జన్మించారు. ఆయనకు ముందు తరువాత కూడా ఎందరో సరస్వతీపుత్రులు, సాహితీప్రియులు తెనాలిలో వెలిశారు. చక్రపాణి అన్నది ఆయన కలం పేరు. చిన్నతనం నుంచీ సాహిత్యం అంటే చెప్పలేనంత అభిమానం. 1932లో చక్రపాణి టీబీ బారిన పడ్డారు. ఆ రోజుల్లో ఆ వ్యాధికి మదనపల్లె శానిటోరియం తగిన చికిత్స అందించేది. అక్కడ చేరిన చక్రపాణికి, అదే వ్యాధితో శానిటోరియం వచ్చిన ఓ బెంగాలీ పరిచయమయ్యారు. ఆయన ద్వారా బెంగాలీ భాష నేర్చుకున్న చక్రపాణి, తరువాతి రోజుల్లో శరత్ బాబు రాసిన బెంగాలీ నవలలు ‘దేవదాసు’, ‘బడీ దీదీ’ తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత మరికొందరు శరత్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినా, చక్రపాణిలాగా పాఠకులను ఆకట్టుకోలేక పోయారు. చక్రపాణి కలం నాటకాలూ పలికించింది.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
పి.పుల్లయ్య ఆహ్వానం మేరకు ఆయన తెరకెక్కించిన ‘ధర్మపత్ని’కి రచన చేశారు చక్రపాణి. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’కు కూడా చక్రపాణి రచయిత. సినిమాలకు రచన చేస్తూ, తన రచనలను పుస్తకాలు వేయిస్తూ ఉండేవారు చక్రపాణి. ఆ క్రమంలో బి.యన్.కె. ప్రెస్ నిర్వహిస్తున్న బి.యన్. రెడ్డి తమ్ముడు బి.నాగిరెడ్డి పరిచయమయ్యారు. అది కాస్తా గాఢ స్నేహంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులు కలసి ‘విజయా’ సంస్థను నెలకొల్పి, విలువలుగల చిత్రాలను వినోదంతో నింపి మరీ ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంకేముంది విజయావారి చిత్రాలను తెలుగు జనం విశేషంగా ఆదరించారు. అలాగే తెలుగు సినిమా స్వర్ణయుగంలో విజయావారి చిత్రాలే అధికంగా విజయం సాధించాయని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు చివరి సినిమా ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ దాకా ఆ ఇద్దరు మిత్రులు అదే తీరున సాగారు. వారు అందించిన “షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు, జగదేకవీరుని కథ, గుండమ్మకథ, సి.ఐ.డి” చిత్రాలను జనం ‘నవరత్నాలు’గా భావించారు.
చెక్కన్న తాను నిర్మించే చిత్రాల విషయంలో ప్రతీ అంశంలోనూ జోక్యం చేసుకొనేవారు. అది ఎల్.వి.ప్రసాద్ లాంటివారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. కానీ, కేవీ రెడ్డి మాత్రం ‘పాతాళభైరవి’ సమయంలో చెక్కన్నతో కలసి పనిచేశారు. ఆ తరువాత నుంచీ విజయా సంస్థలో కేవీ రెడ్డి పనిచేసే సమయంలో ముందుగానే ‘చెక్కన్న జోక్యం చేసుకోరాదు’ అని నియమం పెట్టి మరీ చిత్రాలు తీశారు. దాంతో చెక్కన్నకు దర్శకత్వం అన్నది ఏమీ బ్రహ్మపదార్థం కాదు, స్క్రిప్ట్ సరిగా ఉంటే దర్శకుల గొప్పతనం ఏముంది అనేవారు. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని ఆయన సూచనల మేరకే తెరకెక్కించారు. డి.వి.నరసరాజు రచనతో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ తెరకెక్కింది. అదే సమయంలో ఈ చిత్రాన్ని తమిళంలో ‘మనిదన్ మారవిల్లై’ పేరుతో చక్రపాణి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.
తెలుగులో ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్ కాగా, తమిళ ‘మనిదన్ మారవిల్లై’ పరాజయం పాలయింది. అప్పటి నుంచీ చక్రపాణి ఎక్కడ తేడా వచ్చిందా అన్న ఆలోచనలో పడ్డారు. పద్నాలుగేళ్ళ తరువాత ‘మిస్సమ్మ’కథను అటుఇటుగా మార్చి, ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందించాలనుకున్నారు. బాపును తన కో-డైరెక్టర్ గా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే అంటే 1975 సెప్టెంబర్ 24న చెక్కన్న కన్నుమూశారు. తరువాత బాపు నిర్దేశకత్వంలో ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందింది. ఆ సినిమా ఆట్టే అలరించలేకపోయింది. చెక్కన్న మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. నాగిరెడ్డితో కలసి చెక్కన్న నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్, డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. వారి తలపులు మాత్రం జనం మదిలో నిలచే ఉన్నాయి.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?