C.I. Bharathi: కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ‘ఘర్షణ’ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తున్న చిత్రం ‘సిఐ భారతి’. నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ, “రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ‘సి.ఐ. భారతి’ ఒక పవర్ ఫుల్ స్టోరి. మంత్రి మల్లా రెడ్డి గారు, నటుడు అలీ మా చిత్ర ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టడం జరిగింది. మా సినిమా ద్వారా వచ్చే రిటర్స్న్ లో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయనున్నాం” అని చెప్పారు. సమర్పకులు ‘ఘర్షణ’ శ్రీనివాస్ మాట్లాడుతూ… “దర్శకుడు రమణారెడ్డి బౌండెడ్ స్క్పిప్ట్ తో వచ్చారు. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చాను. రమణా రెడ్డి గారు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉందని, తన క్యారెక్టర్ ను దర్శకుడు రమణారెడ్డి చాలా బాగా డిజైన్ చేశారని హీరో నరేంద్ర చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు హీరోయిన్ గరిమా కృతజ్ఞతలు తెలిపింది.