Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆలియా .. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. “గడిచిన కొన్ని రోజులు నా మనసు ముక్కలు చేశాయి. అయితే అదే సమయంలో విద్యార్థులు తమ హక్కుల కోసం చూపుతున్న ధైర్యం నాకు ఆశను కలిగిస్తోంది. ప్రతి విద్యార్థి వెనుక ఒక కల, ఒక కుటుంబం ఆశలు, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. వారు కేవలం తమ కోసమే కాదు, వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం పోరాడుతున్నారు” అని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా, ఈ యువతే దేశ భవిష్యత్తును నిర్మించబోతున్నారని, వారి స్వరాన్ని వినాల్సిన అవసరం ఉందని ఆలియా పేర్కొన్నారు. “భవిష్యత్తు వారిదే. విద్యార్థుల కోసం, విద్యార్థుల చేతనే మార్పు రావాలి. జై హింద్” అంటూ తన సందేశాన్ని ముగించారు.
ఇదిలా ఉండగా, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, స్వరా భాస్కర్ తదితర సినీ ప్రముఖులు కూడా సంఘీభావం ప్రకటించారు. మరోవైపు నటి అయేషా ఖాన్ నిరసనల్లో పాల్గొన్న సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారని అయేషా ఆరోపించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. NEET పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీయడంతో పాటు, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.

