ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో చక్కని విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఎ. ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై చక్కని ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్ క్వీస్ సమంతా అక్కినేని విడుదల చేసి ఆలీకి, సినిమా టీమ్కి తన అభినందనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ ” ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఫేవరేట్ ఆలీగారు ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు. తమ చిత్రంలోని మూడో పాటను విడుదల చేసిన సమంతకు ఈ సందర్భంగా ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం పెద్ద విజయం సాధించాలనే ఆకాంక్షను ఆలీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ సరదా సంభాషణ కూడా జరిగింది. ‘మీ బ్యానర్ పేరేంటి?’ అని సమంత అడిగిన ప్రశ్నకు ”ఆ వుడ్, ఈ వుడ్ ఎందుకు అని ఆలీవుడ్ అనే పేరు నా బ్యానర్ కు పెట్టాను” అని ఆలీ సరదాగా బదులిచ్చారు.