Aishwarya Rai Speech At Ponniyin Selvan Pre Release Event: మణిరత్నం రూపొందించిన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్-1 ఈనెల 30వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే! దీంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన చిత్రబృందం.. తాజాగా హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఐశ్వర్య రాయ్.. ఇంత ఘనస్వాగతం పలికినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంత గొప్ప టీమ్తో కలిసి పని చేసినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొంది. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కెమెరా ముందు నటించిన నటీనటులు దాకా.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని చెప్పింది. మణిరత్నం డ్రీమ్కు ప్రాణం పోసేందుకు తమకు దక్కిన అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నానంది.
సెల్యూలాయిడ్పై ఒక అద్భుతమైన పెయింటింగ్లాగా మణిరత్నం ఈ సినిమాను తీర్చిదిద్దారని ఐశ్వర్య కొనియాడింది. ఈ సినిమా తన జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో సుహాసిని, మణిరత్నం అన్యోన్య దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరిలో బెటర్ హాఫ్ ఎవరో చెప్పడం కష్టం కానీ, వాళ్లు ఒక కంప్లీట్ పిక్చర్ అని తెలిపింది. మణిరత్నం, సుహాసినిలతో కలిసి తాను చేస్తోన్న తొలి సినిమా ఇదని.. తన వ్యక్తిగత జీవితంలోనూ సుహాసిని ఎంతో ప్రభావం చూపారని, తన కుటుంబంలో ఓ సభ్యులుగా ఆమె నిలిచిపోయారని చెప్పింది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన ఎన్నో మ్యాజికల్ పాటల్లో తాను భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇక చివరగా.. ప్రతిఒక్కరూ ఈ సినిమా చూడాలని, థియేటర్లలో ఎంజాయ్ చేయాలని ఐశ్వర్య కోరింది.