ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది” అని రాగ్ మయూర్ తెలిపారు. ఈ సినిమా విజయం తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
రాగ్ మయూర్కు సినిమా బండి మూవీ మంచి బ్రేక్నిచ్చింది. ఆ తర్వాత ఆయన వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు ఆయన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మొదటి నుంచి చివరి వరకు ఆయన ఓ ప్రాజెక్ట్ను మోయగలరని నిరూపించింది. ‘‘సివరాపల్లి’ సూపర్హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది’’ అని రాగ్ మయూర్ తెలిపారు.
డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ బుర్రకథ కళాకారుడిగా కనిపించబోతున్నారు. “ఇది చాలా ఎక్సైటింగ్తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను” అని ఆయన తెలిపారు. తన ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉందని చెప్పిన రాగ్ మయూర్, “నా కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను,” అని అన్నారు.
