Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!

  • పండ్ల రసాలతో హై బీపీ ముప్పు.. తాజా అధ్యయనం షాకింగ్
  • పండు తినడం మంచిదా? జ్యూస్ తాగడం మంచిదా?
  • ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ సమస్యలకు జ్యూస్ కారణమా?
  • తల్లిదండ్రులు తప్పక పాటించాల్సిన ఆరోగ్య సూచనలు
Juices

Juices

Parents Alert: పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు (Fruit Juices) చాలా మంచివని భావించి చాలామంది తల్లిదండ్రులు రోజూ క్రమం తప్పకుండా అందిస్తుంటారు. అయితే, చిన్నతనం నుంచే పండ్ల రసాలు , చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ ‘సర్క్యులేషన్’ (Circulation) లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తులపై 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పండ్ల రసాలతో అధిక రక్తపోటు (High BP) ప్రమాదం

‘న్యూస్ మెడికల్ నెట్’ నివేదిక ప్రకారం.. వారానికి మూడు కంటే తక్కువ సార్లు తీపి పానీయాలు తాగే పిల్లలతో పోలిస్తే, రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తాగే పిల్లలకు , కౌమారదశలో ఉన్నవారికి పెద్దయ్యాక అధిక రక్తపోటు (BP) వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అదేవిధంగా, అరుదుగా పండ్ల రసాలు తాగే పిల్లలతో పోలిస్తే, రోజుకు 1.5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు తాగే చిన్న పిల్లలకు భవిష్యత్తులో బీపీ వచ్చే ప్రమాదం 35 శాతం పెరుగుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు.

పండు తినడం మేలా? రసంగా తాగడం మేలా

పోషకాహార సూత్రాల ప్రకారం.. పండ్లను పండుగా తినడానికి, రసంగా తాగడానికి చాలా తేడా ఉంటుంది. పండును నేరుగా తిన్నప్పుడు అందులో లభించే పీచుపదార్థం (Fiber) జీర్ణాశయం త్వరగా ఖాళీ అవ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలు క్రమంగా, నిదానంగా పెరుగుతాయి. అదే పండ్లను జ్యూస్ చేసినప్పుడు అందులోని పీచుపదార్థం పూర్తిగా తొలగిపోయి చక్కెరలు రక్తంలో వేగంగా కలిసిపోతాయి.

ఈ విధంగా ఇన్సులిన్ స్థాయిలు పదేపదే పెరగడం వల్ల శరీరంలో ‘ఇన్సులిన్ నిరోధకత’ (Insulin Resistance) ఏర్పడుతుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించడమే కాకుండా, మూత్రపిండాలు శరీరంలో సోడియంను నిల్వ ఉంచేలా చేసి, ద్రవ సమతుల్యతను నియంత్రించే ‘రెనిన్-యాంజియోటెన్సిన్-ఆల్డోస్టెరాన్’ హార్మోన్ల వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు వేగంగా పెరుగుతుంది.

ఫ్యాటీ లివర్ , ఇతర అనారోగ్య సమస్యలు

పండ్ల రసాలు , తీపి పానీయాల ద్వారా లభించే అధిక ఫ్రక్టోజ్ (Fructose) ప్రధానంగా కాలేయంలో జీవక్రియకు గురవుతుంది. ఇది కాలేయంలో కొవ్వును పెంచి, ఫ్యాటీ లివర్ (Fatty Liver), అధిక ట్రైగ్లిజరైడ్లు , అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా, ఈ ఫ్రక్టోజ్ జీవక్రియ వల్ల ఉత్పత్తయ్యే యూరిక్ యాసిడ్ రక్తనాళాల పనితీరును దెబ్బతీసి రక్తనాళాలు సడలకుండా చేస్తుంది.

పరిష్కారం ఏమిటి? తల్లిదండ్రులు ఏం చేయాలి?

పండ్లు అనారోగ్యకరమైనవి కావు, కానీ వాటిని ఇచ్చే విధానంలోనే మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక చక్కెర పానీయం బదులు పండు ఇవ్వడం వల్ల హై బిపి ప్రమాదం 22% తగ్గుతుంది. అదేవిధంగా జ్యూస్‌కు బదులుగా పండును నేరుగా తినిపిస్తే ప్రమాదం 19% తగ్గుతుంది.

పండ్లను ముక్కలుగా చేసి తినిపించడం వల్ల లభించే పీచుపదార్థం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు , పాలీఫెనాల్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పొటాషియం సోడియంను బయటకు పంపి సహాయపడితే, పాలీఫెనాల్స్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇకపై పిల్లలకు పండ్లను రసంగా మార్చి ఇవ్వడం కంటే, నేరుగా పండ్లనే తినిపించే అలవాటు చేయడం వారి భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతైనా మంచిది..