NTV Telugu Site icon

Ear buds: ఇయర్‌బడ్స్ చాలా సమయం వినియోగిస్తున్నారా..? డబ్ల్యూహెచ్వో హెచ్చరిక

Ear Buds

Ear Buds

వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్వో తన నివేదికలో 12 నుండి 35 సంవత్సరాల వయస్సు గల ఒక బిలియన్ (100 కోట్ల) మందికి పైగా వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం ఇయర్‌బడ్‌ల ద్వారా ఎక్కువసేపు సంగీతాన్ని వినడం.. ఎక్కువ శబ్దం వచ్చే ప్రదేశాలలో ఉండటం అని తెలిపింది. ఈ పరికరాలు లోపలి చెవిని దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ పరికరాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

భారీ శబ్దం చెవులకు హాని కలిగిస్తోంది..
ఇయర్‌బడ్‌లు లేదా హెడ్‌ఫోన్‌లతో వ్యక్తిగత మ్యూజిక్ ప్లేయర్‌ను ఉపయోగించే 65 శాతం మంది వ్యక్తులు 85 (డెసిబెల్) కంటే ఎక్కువ వాల్యూమ్‌లో నిరంతరం ఉపయోగిస్తున్నారు. అటువంటప్పుడు ఆ తీవ్రత చెవుల లోపలి భాగాలకు చాలా హానికరం అని గుర్తించారు. అలాగే భారీ శబ్దాల వల్ల చెవి లోపల కణాలు కాలక్రమేణా దెబ్బతింటాయి. దాని వల్ల వినికిడి సామర్థ్యం మరింత క్షీణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాబోయే దశాబ్దాలలో మిలియన్ల మంది ప్రజలు ఈ రకమైన సమస్యతో బాధపడే అవకాశం ఉంది.

నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు..
ఈ తీవ్రమైన ముప్పుపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ENT డాక్టర్ డేనియల్ ఫింక్ చెప్పారు. ప్రస్తుతం జనాలు ఇయర్‌బడ్‌ల వంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల 40 ఏళ్ల వయస్సులో తక్కువ వినికిడి లోపానికి దారితీయవచ్చని అన్నారు. వినికిడి లోపం కేవలం చెవి సమస్యలకు మాత్రమే కాదని.. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారికి జ్ఞాపకశక్తి కోల్పోవడం వచ్చే ప్రమాదం రెండింతలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. పూర్తిగా వినలేని, చెవుడు బాధితులైన వ్యక్తులలో జ్ఞాపకశక్తి ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

శబ్దాన్ని తక్కువగా ఉంచండి
ఆరోగ్య నిపుణులు ధ్వనిని డెసిబెల్స్ అనే యూనిట్‌లో కొలుస్తారు. 60-70 డెసిబుల్స్ లేదా అంతకంటే తక్కువ శబ్దం మంచిదేనని చెబుతున్నారు. 85 లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు ఎక్కువసేపు వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడవచ్చు. ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటి పరికరాల పరిమాణం 100 కంటే ఎక్కువగా ఉంటుంది. వీటిని కొన్ని గంటలు మాత్రమే ఉపయోగించాలి. లేదంటే.. చెవి కణాలకు హాని కలిగించవచ్చు, వినికిడి సమస్యలను పెంచుతుంది.