కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు బయటపడుతున్నాయి. ఇంకా చాలా దేశాల్లో భయంకర స్థాయిలోనే కరోనా ఉంది. అయినప్పటికీ.. స్కూల్స్ తెరవాల్సిందే అంటోంది వరల్డ్ బ్యాంక్. చిన్నారులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు తక్కువేనని తన తాజా నివేదికలో తెలిపింది. టీకాల పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది. వ్యాక్సిన్ రూపొందించక ముందే చాలాదేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ.. పరిస్థితులేమీ విషమించలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.
వైరస్ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని, అదే సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం వల్ల పిల్లలు, సిబ్బంది మధ్య వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రీ-పైమరీ, ప్రైమరీ పాఠశాలల్లోనూ వైరస్ సంక్రమణ తక్కువగానే ఉందని తెలిపింది. పాఠశాల సిబ్బందికి మాత్రమే తోటి సిబ్బంది నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని.. పిల్లల నుంచి కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల్లోనూ స్కూల్స్ ప్రారంభించారు.
అయితే తెలంగాణలో విద్యార్థులను బడులకు రావాలంటూ బలవంతం చేయవద్దని.. ఆన్లైన్లోనూ క్లాసులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో… అలాగే క్లాసులు జరుగుతున్నాయి. అయితే, పాఠశాలలను మూత వేయడం వల్ల వైరస్ సంక్రమణ ముప్పును మాత్రమే తొలగిస్తుందని… కానీ, దీనివల్ల పిల్లల అభ్యాసన, మానసిక ఆరోగ్యంతో పాటు వారి పూర్తి అభివృద్ధికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. స్కూళ్లు తెరిస్తే వచ్చే ముప్పు కంటే అవి తెరవకపోవడం వల్ల కలిగే నష్టాలే అధిక రెట్లు ఎక్కువని స్పష్టం చేసింది. అందువల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వ్యూహాలను అమలు చేస్తూ విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.