Iran: ‘‘ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు’’.. సుప్రీంలీడర్ ఖమేనీ మెగా స్పీచ్..

  • ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు..
  • హిజ్బుల్లా.. పాలస్తీనియన్లు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది..
  • నస్రల్లా మరణం వృథా కాదు..
  • ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పీచ్..
Khamaini

Khamaini

Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు. ‘‘మేము మా శత్రువులను ఓడిస్తాము’’ అని ఖమేనీ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం తన ఉపన్యాసంలో ఇజ్రాయిల్‌కి వ్యతిరేఖంగా పాలస్తీనియన్లకు, లెబనీస్ ప్రజలకు మద్దతు తెలిపారు. తమ శత్రువులను ఓడించాలని ప్రతిజ్ఞ చేశారు. టెహ్రాన్‌లోని ఒక మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఖమేనీ మాట్లాడారు. ఇటీవల ఇజ్రాయిల్‌పై జరిగిన క్షిపణి దాడుల్ని ‘‘ప్రజాసేవ’’గా అభివర్ణించారు. హమాస్ లేదా హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఇరాన్ మీతో ఉందని అతను ప్రకటించాడు.

Read Also: Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..

ఇటీవల హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతడి ప్రాణాలకు ఇజ్రాయిల్ నుంచి ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, గత ఐదేళ్లలో తొలిసారిగా ఖమేనీ శుక్రవారం రోజు ఉపన్యసించారు. మంగళవారం ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.

ఖమేనీ తన ప్రసంగంలో హసన్ నస్రల్లాని కొనియాడారు. నస్రల్లా మనతో లేకున్నా, అతడి ఆత్మ, అతడి మార్గం మనకు ఎప్పటికీ స్పూర్తినిస్తుందని చెప్పాడు. అతడి బలిదానం మరింత ప్రభావాన్ని పెంచుతుందని అన్నాడు. నస్రల్లా మరణం వృథా కాదని, మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటుందని, శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. లెబనాన్ రక్తపాతంలో ఉన్న ప్రజలకు సాయం చేయడానికి జిహాద్, అల్ అక్సా మసీదు కోసం యుద్ధానికి మద్దతు ఇవ్వడం ముస్లింలందరి విధి, బాధ్యత అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడిని సరైన చర్యగా అభివర్ణించాడు.