NTV Telugu Site icon

Sheikh Hasina: అగ్ర రాజ్యం కుట్రకు హసీనా బలైందా? బలపరుస్తున్న కొత్త అనుమానాలివే!

Sheikhhasinaus

Sheikhhasinaus

పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం కూలిపోవడానికి ఇదే ప్రధాన కారణమని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎవరి కోసమంటారా? బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లు తాజాగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అగ్ర రాజ్యంతో ఆమెకు సరైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు బీజం పడినట్లుగా తెలుస్తోంది.

షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణమనే భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై.. తీవ్ర నిరసనల మధ్య ఆమె కట్టుబట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జనవరిలో బంగ్లాదేశ్‌ ఎన్నికలు జరిగాయి. దీనిని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) బహిష్కరించింది. ఈ ఎన్నికలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. పోలింగ్‌ ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా, కెనడా, రష్యా, ఓఐసీ, అరబ్‌ పార్లమెంట్‌ పరిశీలకులు వచ్చారు. ఎన్నికలు సాఫీగానే జరిగినట్లు వారు పేర్కొన్నారు. కాగా అమెరికా విదేశాంగశాఖ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని ఆరోపించింది. ఇది నాలుగోసారి ఎన్నికైన హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కొన్ని నెలలు మౌనంగా ఉన్న హసీనా.. మే నెలలో ఓ సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం.. హసీనాపై పగ బట్టినట్లుగా తెలుస్తోంది. ఓ న్యాయస్థానం కారణంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడం.. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. తీవ్ర నిరసనల మధ్య హసీనా దేశాన్ని వదిలిపెట్టే పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో ఉన్న వైరం తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.