Site icon NTV Telugu

Iran-US: ఇరాన్‌పై దాడిని తీవ్రం చేసిన అమెరికా.. బీ-2 బాంబర్లతో దాడి

B2bombers

B2bombers

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇలా ఇరు వర్గాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి.

తాజాగా అమెరికా దాడులను మరింత తీవ్రం చేసింది. ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ప్రయోగిస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసింది. ఇరాన్ భారీ నౌక మంటల్లో కాలిపోతుంది.

అమెరికా వైమానిక దళానికి చెందిన B-2 స్టెల్త్ బాంబర్లు ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఉపయోగించబడ్డాయని యూనిటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ బాంబర్లు అమెరికాలోని వైట్‌మాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ప్రయాణం ప్రారంభించి సుమారు 37 గంటల రౌండ్-ట్రిప్ మిషన్‌ను పూర్తి చేసినట్లుగా తెలిపింది. ఈ దాడుల్లో గగనతలంలో ఇంధనం నింపుకునే విధానం కూడా ఉపయోగించినట్లు పేర్కొంది.

మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న వైట్‌మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రస్తుతం B-2 స్టెల్త్ బాంబర్లకు ఏకైక కార్యాచరణ కేంద్రంగా ఉంది. అమెరికా స్టెల్త్ దాడి సామర్థ్యంలో ఈ స్థావరం కీలక పాత్ర పోషిస్తోంది. B-2 స్టెల్త్ బాంబర్లను 2022లో అధికారికంగా ఆవిష్కరించారు. అణు, సాధారణ ఆయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే సిబ్బంది లేకుండానే పనిచేసే సామర్థ్యం కూడా దీనికి ఉంటుందని అధికారులు తెలిపారు.

అమెరికా సెనెట్ ఆమోదించిన తాజా నిధుల బిల్లులో B-21 రైడర్ ప్రాజెక్ట్ కోసం సుమారు 1.92 బిలియన్ డాలర్లు కేటాయించారు. సెనేటర్ కార్యాలయం తెలిపిన ప్రకారం.. భవిష్యత్తులో ఈ కొత్త బాంబర్లు కూడా వైట్‌మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోనే ఉండే అవకాశం ఉంది. అదే బిల్లులో సైనిక సిబ్బందికి 3.8 శాతం వేతన పెంపు కూడా ప్రకటించారు.

గత సంవత్సరం ఇరాన్‌పై జరిగిన దాడిలో B-2 బాంబర్లు ఇరాన్ అణు స్థావరాలపై 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ బాంబులను వదిలినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భూమి లోతుల్లో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగిస్తారు. అమెరికా వైమానిక దళం తెలిపిన ప్రకారం.. మొదటి కార్యాచరణకు సిద్ధమైన B-21 రైడర్ బాంబర్ 2027 నాటికి సేవల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version