ప్రపంచ శాంతికి ఈరోజు గొప్ప రోజు అని.. ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్కు విసుగొచ్చిందని.. ఇప్పుడు శాంతి కోరుకుంటోందని తెలిపారు. మిగతా దేశాలకూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇరాన్ తిరిగి పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని.. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తామన్నారు. అన్నీ బాగానే జరుగుతాయని నమ్మకం ఉందని… అమెరికాలో మాదిరిగానే మధ్యప్రాచ్యానికి కూడా స్వర్ణయుగం రాబోతుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది! అలాగే మిగతా అందరికీ కూడా! హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సామాగ్రిని సిద్ధం చేసుకుని.. అంతా సవ్యంగా జరిగేలా చూసుకోవడానికి అక్కడే ఉంటాం. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం అనుభవిస్తున్నట్లే.. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చు!!!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఐరాస స్వాగతం..
ఇక రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి కోసం అన్ని పక్షాలు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ మద్దతు
ఇరాన్పై బాంబు దాడులను నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది, అయితే చివరి నిమిషంలో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ చేరలేదని స్పష్టం చేసింది. లెబనాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో చర్చల కోసం రెండు వారాల విరామాన్ని ఉపయోగించుకుంటామని టెహ్రాన్ ప్రకటించింది. పాకిస్థాన్లో శుక్రవారం చర్చలు ప్రారంభం కానున్నాయి.
