Site icon NTV Telugu

Trump: మిత్రదేశాలతో చెడుతున్న మైత్రీ.. ఫ్రాన్స్‌పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ వార్నింగ్

Trump2

Trump2

గ్రీన్‌లాండ్ వివాదం రోజురోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకుంటామని ట్రంప్ చెబుతుంటే.. మిత్రదేశాలైన యూరోపియన్ దేశాలు మాత్రం అబ్బే.. అలా కుదరదంటూ అడ్డుపడుతున్నాయి. దీంతో మిత్ర దేశాల మధ్యే వార్ మొదలయ్యేటట్టుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్ విషయంలో ఫ్రాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో తాజాగా ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రాన్స్‌పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రూత్ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా భద్రతా దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను ట్రంప్ స్వాధీనం చేసుకుంటున్నారని.. రష్యా, చైనా నుంచి ఎదురైన ముప్పు నుంచి రక్షించడంలో డెన్మార్క్ విఫలమైందని.. అందుకే అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ ప్రకటనను అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సమర్థించారు. అయితే స్కాట్ బెసెంట్ సమర్థనను ఫ్రాన్స్ తప్పుపట్టింది. అంతేకాకుండా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఒక ప్రైవేటు సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘‘గ్రీన్‌లాండ్‌పై ఏమి చేస్తున్నారో.. తనకు అర్థం కావడం లేదు.’’ అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక గాజా కోసం శాంతి మండలి ఏర్పాటు కోసం ట్రంప్ ముందుకొచ్చారు. అయితే ఈ శాంతి మండలిని కూడా ఫ్రాన్స్ తప్పుపట్టింది. ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ ఆహ్వానానికి ఫ్రెంచ్ అనుకూలంగా లేనట్లుగా తెలుస్తోంది.

ట్రంప్ ఆగ్రహం..
గ్రీన్‌లాండ్ వ్యవహారం, ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై ఫ్రెంచ్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు. గ్రీన్‌లాండ్‌పై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి వచ్చిన ప్రైవేట్ సందేశాన్ని కూడా ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సమావేశం జరుగుతోంది. దీని కోసం ట్రంప్, G7 నాయకులు రానున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను మాక్రాన్ కలవనున్నారు. అంతేకాకుండా గురువారం ట్రంప్‌కు విందు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విందుకు అనేక దేశాలను కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద దావోస్ వేదికగా గ్రీన్‌లాండ్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంద జరుగుతుందో చూడాలి.

Exit mobile version