Site icon NTV Telugu

Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?

Trump32

Trump32

ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం మారుతుందా? తాజాగా ఆయన ప్రణాళికలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన వ్యూహం ఖర్గ్ ద్వీపం వైపు మళ్లినట్లుగా అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి.

ట్రంప్ అసలు దృష్టంతా ఖర్గ్ ద్వీపంపైనే ఉందని.. దాన్ని స్వాధీనం చేసుకోవడమే ప్రస్తుత లక్ష్యంగా అని వైట్ హౌస్ అధికారి చెప్పినట్లుగా ఆక్సియోస్ వెబ్‌సైట్‌కు పేర్కొంది. ఇప్పటికే ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా స్వాధీనం తీసుకునేందుకు పెద్ద ఎత్తున అమెరికా బలగాలను పంపబోతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

యూఎస్ సెంట్రల్ కమాండ్ మాజీ కమాండర్, రాయబారి అయిన జాన్ అబిజైడ్ 2007లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రసంగంలో మాట్లాడుతూ.. ‘‘నిస్సందేహంగా ఇది చమురు గురించే. మనం దానిని నిజంగా కాదనలేము.’’ అని ఇరాక్ యుద్ధ సమయంలో వ్యాఖ్యానించారు. ఇరాక్ యుద్ధానికి చమురుతో సంబంధం ఉందని అబిజైద్ అంగీకరించారు. దీనిని బట్టి చూస్తుంటే ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం కూడా ఖర్గ్ ద్వీపం కోసమే జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. తాజా అమెరికా వ్యూహం ప్రకారం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు.. అలాగే ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించడానికి ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.

ఖర్గ్ ద్వీపం..
ఖర్గ్ ద్వీపం.. ఇది ఇరాన్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ద్వీపం కాదు.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిది. ఈ ఖర్గ్ ద్వీపాన్ని గనుక అమెరికా ముట్టుకుంటే ప్రపంచ దేశాలకు చమురు సంక్షోభం తీవ్రస్థాయిలో తలెత్తి అల్లాడిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ప్రతి రోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేస్తోంది. విదేశాలకు విక్రయించే 10 బ్యారెళ్ల చమురులో తొమ్మిది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే వెళ్తాయి. ఈ ద్వీపానికి దక్షిణ భాగంలో డజన్ల కొద్దీ నిల్వ ట్యాంకులు ఉన్నాయి.

ఖర్గ్ ద్వీపం కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. 1960 నుంచి ఇరాన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన అమెకో కంపెనీనే నిర్మించిందని నివేదికలు ఉన్నాయి. చమురు రవాణా ఎక్కువ భాగం ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంటాయి. ప్రస్తుతం ఖర్గ్ ద్వీపంలోని చమురు కేంద్రం చాలా చురుగ్గా పని చేస్తోందని నివేదికలు పేర్కొన్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ఒకవేళ అటువంటి ఆపరేషన్‌కు ఆమోదం లభిస్తే.. భారీ స్థాయిలో సైనికులు అవసరం అవుతారు. ఇక ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత అమెరికా సైనికులపై ఇరాన్ ప్రత్యక్ష దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భారీ దాడులతో ఇరాన్‌ను బలహీన పరిచి.. చర్చలకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని.. దీనికి దాదాపు ఒక నెల సమయం పడుతుందని వైట్ హౌస్ ఆక్సియోస్‌కు తెలిపింది.

ప్రస్తుతం ఇరాన్‌కు అదనపు బలగాలను పంపడంపై వైట్ హౌస్, పెంటగాన్ చర్చిస్తున్నాయి. కానీ ఇంకా తుది నిర్ణయాలు తీసుకోలేదు. ఆక్సియోస్‌కు ముందు.. న్యూస్‌మాక్స్, రాయిటర్స్ కూడా అదనపు బలగాలను పంపే ప్రణాళికలపై వార్తలు ప్రచురించాయి. దాదాపు 2,500 మంది మెరైన్‌లు కూడా కొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version