అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండవని, ఆ విషయం వారికి కూడా బాగా తెలుసని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో వైట్హౌస్లో జరగనున్న కీలక సమావేశానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఉద్రిక్తతల అనంతరం టెహ్రాన్తో మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. నెతన్యాహు మాత్రం ఇరాన్పై మరింత కఠిన వైఖరి అవలంబించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను పొందదు. ఆ విషయం వారికి తెలుసు. మేము చాలా మంచి చర్చలు జరిపాం.’’ అని తెలిపారు. ఇరాన్ విషయంలో గతంలో కఠిన వైఖరితో ఉన్న దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ‘‘లిండ్సే గ్రాహమ్ మొదట ఇరాన్ విషయంలో చాలా హార్డ్లైన్ వైఖరిలో ఉండేవారు. కానీ చివరి రోజుల్లో దేశాన్ని పూర్తిగా నాశనం చేయడం కంటే ఒప్పందం కుదుర్చుకోవడమే మంచిదని భావించారు.’’ అని ట్రంప్ చెప్పారు.
వాషింగ్టన్ చేరుకున్న నెతన్యాహు సోమవారం లిండ్సే గ్రాహమ్ స్మారక విందులో పాల్గొన్నారు. అంత్యక్రియలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక అధ్యక్షుడిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్, నెతన్యాహు మధ్య ఇది ఎనిమిదో సమావేశం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగే తొలి ప్రత్యక్ష భేటీ కూడా ఇదే. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా మద్దతుతో కుదిరిన ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందం అమలు, గాజా పరిస్థితి, అలాగే అబ్రహాం ఒప్పందాల విస్తరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇరాన్ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య వ్యూహాత్మక భేదాభిప్రాయాలు ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ సైనిక చర్యల తర్వాత దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా.. నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవాలంటే సైనిక ఒత్తిడి కొనసాగాల్సిందేనని భావిస్తున్నారు. వాషింగ్టన్ బయలుదేరే ముందు నెతన్యాహు మాట్లాడుతూ.. మా చర్చల్లో తొలి ప్రాధాన్యం ఇరాన్కే ఉంటుందని.. మా భద్రతను కాపాడుకోవడంతో పాటు శాంతి ఒప్పందాల పరిధిని విస్తరించడమే లక్ష్యమని తెలిపారు.
ఇటీవల ట్రంప్ పలుమార్లు ఇరాన్తో దౌత్య చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక రోజు ముందే ఒప్పందం కుదిరే మంచి అవకాశం ఉందని పేర్కొంటూ.. ఇరాన్ అధికారులు అమెరికాతో చర్చలు జరుపుతున్నారని కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్, ఖతార్ వంటి మధ్యవర్తి దేశాల ద్వారా సందేశాలు మాత్రమే మార్పిడి అవుతున్నాయని తెలిపారు. అలాగే ప్రస్తుతం చర్చలకు తిరిగి రావడంలో తమకు ఎలాంటి తొందర లేదని, ఇటీవల జరిగిన ఘర్షణల తర్వాత కూడా తమకు వ్యూహాత్మక ఆధిక్యం ఉందని, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి అంశంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టామని ఇరాన్ పేర్కొంది.
ట్రంప్-నెతన్యాహూ సంబంధాలపై దృష్టి
ఇటీవలి నెలల్లో ట్రంప్, నెతన్యాహు సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ కాల్పుల విరమణ చర్చల సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనంతరం ట్రంప్.. నెతన్యాహును చాలా కఠినమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అయితే నెతన్యాహు మాత్రం వాటిని ‘‘వ్యూహాత్మక భేదాభిప్రాయాలు మాత్రమే’’ అని పేర్కొంటూ.. ప్రాంతీయ భద్రత వంటి ప్రధాన అంశాల్లో ఇద్దరి లక్ష్యాలు ఒకటేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న ట్రంప్-నెతన్యాహూ సమావేశం.. ఇరాన్ విషయంలో ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వస్తారా లేదా అన్నదానిపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

