ఇరాన్పై మరోసారి అమెరికా భారీ దాడులు చేయనుందా? మనుపటి కంటే తీవ్రంగా పరిణామాలు ఉండనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి భారీ సైనిక దాడికి ఆదేశాలు ఇచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెల్లడించింది. ఈ దాడులు ఈ వారాంతంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అమెరికా అధికారులు వెల్లడించిన సమాచారాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. ఇరాన్ను ఒత్తిడికి గురిచేసి లొంగిపోయేలా చేయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఇరాన్పై బలప్రయోగంతో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ శపథం చేసిన కొన్ని గంటలకే ఈ కథనం వెలువడింది. ఇరాన్తో కొనసాగుతున్న చర్చలపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మేము వారిపై చాలా తీవ్రంగా దాడి చేస్తాం. ఏదో ఒక దశలో ఇక ఈ పరిస్థితిని తట్టుకోలేమని వాళ్లే చెబుతారు’’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇరాన్కు చెందిన కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎబీఎస్ న్యూస్ వేర్వేరు కథనంలో వెల్లడించింది. చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి దాడులు జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పౌర అవసరాలకు సంబంధించిన లక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా బాంబుదాడులతో ధ్వంసం చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం యుద్ధ నేరాల అంశాన్ని లేవనెత్తవచ్చని పలు హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేసే అవకాశంపై వార్తలు రావడంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన ట్రేడింగ్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ముడి చమురు ధర బ్యారెల్కు 86 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.. ఇరాన్పై తక్షణ దాడి జరగనున్నట్లు వస్తున్న వార్తలపై నేరుగా స్పందించలేదు. అయితే ఇరాన్ అర్థవంతమైన చర్చలకు రావాలని ట్రంప్ భావించే వరకు ఆ దేశం మూల్యం చెల్లిస్తూనే ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రంప్ గతంలో కూడా పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించిన తర్వాత తన వైఖరిని మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సైనిక స్థావరాలపై జరిగే క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. అమెరికా సైనిక శక్తితో పోలిస్తే ఇరాన్ సైనిక సామర్థ్యం పరిమితంగానే ఉన్నప్పటికీ.. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసి ప్రాంతీయ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపు పూర్తిగా మూసివేయడంతో ప్రపంచ చమురు, సహజవాయువు, ఎరువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ దాడుల ప్రభావం పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. ఈ వారం ఈజిప్టు కూడా ఘర్షణ ప్రభావానికి గురైంది. దమియెట్టా ఓడరేవులో ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) రవాణా చేస్తున్న రెండు నౌకలపై డ్రోన్లతో దాడి జరిగినట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ప్రతి కొత్త ఘర్షణతో అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆహారం, గృహాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికన్లు ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరల ప్రభావాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ నియంత్రణ కీలకంగా మారనున్న నేపథ్యంలో.. యుద్ధ నిర్వహణతో పాటు ఆర్థిక వ్యవస్థను ట్రంప్ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పలు సర్వేలు సూచిస్తున్నాయి.
శుక్రవారం మేరీల్యాండ్లోని క్యాంప్ డేవిడ్ అధ్యక్ష నివాసంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకత్వంపై తన నమ్మకం తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవాలను తప్పుగా చూపిస్తున్నారు. అందుకే వారిపై నమ్మకం కోల్పోతున్నాను’’ అని అన్నారు. ఏదో ఒక సమయంలో ఇరాన్ ఇక ఈ పరిస్థితిని తట్టుకోలేమని చెబుతుందని మరోసారి పేర్కొన్నారు.
అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అమెరికా గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, అమెరికాను నమ్మలేమని ఇరాన్ నాయకత్వం కూడా ఆరోపిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయా లేదా అమెరికా మరోసారి భారీ సైనిక చర్యలకు దిగుతుందా అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

