టర్కీ వేదికగా జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్తో ఇటలీ ప్రధాని మెలోనీ ఎడముఖంగానే ఉన్నట్లు తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది. ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందంటూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. వైరల్ కావడంతో వెంటనే మెలోనీ కౌంటర్ ఇచ్చారు. ఇటలీ ఎప్పుడు తలవంచదని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇప్పుడు తాజాగా టర్కీ రాజధాని అంకారా వేదికగా నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మళ్లీ ట్రంప్-మెలోనీ ఒకే వేదికపైకి వచ్చారు. కానీ ఎడముఖం.. పెడముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాటో దేశాల పెద్దలు గ్రూప్ ఫొటో దిగేందుకు ట్రంప్ వస్తున్నప్పుడు మెలోనీ చూసేందుకు ఇష్టపడలేదు. ట్రంప్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎవరినో చూసి నవ్వుతున్నట్లుగా మెలోనీ నటించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల ట్రంప్, మెలోనీ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ‘‘ఇటలీ కానీ, నేను కానీ ఎవరినీ వేడుకోము’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగని ట్రంప్.. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ‘‘Restraining Order Needed’’ అనే క్యాప్షన్తో మెలోనీకి సంబంధించిన ఎడిట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మెలోనీ నిరాకరించడం కూడా ఇరువురి మధ్య దూరాన్ని పెంచింది. ఈ అంశంపై స్పందించిన ట్రంప్.. మెలోనీతో తన సంబంధాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ఆమె ‘‘మంచి వ్యక్తి’’ అని వ్యాఖ్యానించారు.

