Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది.
ఇదిలా ఉంటే, భారత్లో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద చమురు ధరలు తక్కువగానే పెరిగాయి. కానీ శ్రీలంకలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ స్థాయిలో పెంచింది. శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ.434కి పెరగగా, డీజిల్ ధర లీటరుకు రూ.407కి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీఎస్) శనివారం కొత్త ధరలను ప్రకటించింది. ఇవి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రపంచ చమురు సంక్షోభం శ్రీలంకను కుదేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 293 ఉండగా, ఇది ఇప్పుడు రూ. 434కు పెరిగింది.
