దక్షిణాఫ్రికాలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లరి మూకలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర సమరయోధుడు నెల్సన్ మండేలా స్పూర్తితో అప్పట్లో దక్షిణాఫ్రికా స్వాతంత్రపోరాటంతో పాల్గొని తరువాత రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎదిగిన జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు.
వీరి మూలాలు ఇండియాలోనే ఉండటం విశేషం. యూపీలోని సహరాన్పూర్ సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన గుప్తా బ్రదర్స్ అజయ్, అతుల్, రాజేష్లు మొదట ఢిల్లీలో కంప్యూటర్ విడిభాగాల వ్యాపారం చేశారు. ఇందులో అతుల్ దక్షిణాఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం ప్రారంభించారు. అదే సమయంలో మండేలా పార్టీ అయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్తో సంబంధాలు పెంచుకున్నారు. వ్యాపారం జోరుగా సాగింది. థాబో ఎంబెకి ఇండియా వచ్చిన సమయంలో ఆయన సహచరుడు ఎపోస్ పహాద్తో అతుల్కు పరిచయం ఏర్పడింది.
Read: అనుష్క సినిమా ఆగిపోయిందా ?
దీంతో గుప్తా కుటుంబం మొత్తం దక్షిణాఫ్రికా పయనం అయింది. అక్కడే చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టారు. పార్టీ బ్యూరోకాట్స్కు వాటాలు వెళ్లేవి. అలా మొదలైన వ్యాపారం యూరేనియం తవ్వకాల వరకు వెళ్లింది. అప్పట్లో అధ్యక్షుడి ఇంట్లో పార్టీలు అంటే గుప్తా బ్రదర్స్ కు పిలుపు ఉండాల్సిందే. ఇలా ఎంబెకీ పార్టీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూనే, ప్రత్యర్థి నేత జుమాతో రహస్యంగా మంతనాలు సాగించేవారు. జుమా అధ్యక్షుడు అయ్యాక గుప్తా బ్రదర్స్ పెత్తనం మొదలైంది. గుప్తా బ్రదర్స్ ఎవరికి పదవి ఇవ్వాలి అంటే వారికి ఇవ్వాల్సిందే.
ఆ విధంగా పరిపాలనపై పట్టు పెంచుకున్నారు. అయితే, అనుభవం లేని వ్యక్తికి ఆర్ధిక శాఖను అప్పగించడంతో పతనం మొదలైంది. దక్షిణాఫ్రికా ఆర్ధికంగా కుప్పకూలిపోయింది. జుమా అవినీతి బయటపడతంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటు గుప్తా బ్రదర్స్కు కాంట్రాక్టులు ఆగిపోయాయి. స్టాక్ ఎక్సెంజి నుంచి గుప్తా బ్రదర్స్ కంపెనీలు డీలిస్ట్ కావడంతో షేర్లు పడిపోయాయి. వ్యాపారం దెబ్బతినడంతో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో గుప్తాబ్రదర్స్ పెట్టేబేడా సర్దుకొని దుబాయ్ వెళ్లిపోయారు. జుమా జైల్లో ఉన్నారు.