SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు మోహరింపును భారీగా పెంచడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డ్రాగన్ దూకుడు.. భారత్ ముందస్తు మేల్కొలుపు
సిప్రి నివేదిక ప్రకారం.. చైనా తన అణ్వాయుధాల మోహరింపును వేగంగా పెంచుతోంది. 2025లో చైనా వద్ద మోహరించిన అణ్వాయుధాల సంఖ్య 24 ఉండగా.. 2026 జనవరి నాటికి ఆ సంఖ్యను 34కు పెంచింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే 10 కొత్త అణు వార్హెడ్లను రెడీ చేసింది. ఇదే సమయంలో చైనా దూకుడుకు బ్రేక్ వేసే వ్యూహంలో భాగంగా, భారతదేశం కూడా ఇప్పుడు క్షిపణులపై తక్కువ సంఖ్యలో అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచుతోందని సిప్రి అంచనా వేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం భారత్ వద్ద 12 మోహరించిన అణ్వాయుధాలు ఉన్నాయి. శాంతికాలంలో భారత్ ఇంత పెద్ద ఎత్తున అణ్వాయుధాలు మోహరించడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
అగ్రస్థానంలో రష్యా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు దాదాపు 4,012 అణ్వాయుధాలు మోహరింపు దశలో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. బాలిస్టిక్ క్షిపణులపై అమర్చిన 2,100 నుంచి 2,200 వరకు వార్హెడ్లు “అత్యంత అప్రమత్తత” (High-Operational Alert) స్థితిలో ఉంచబడ్డాయి. వీటిలో దాదాపు అన్ని అణ్వాయుధాలు రష్యా, అమెరికాలకు చెందినవే కాగా, స్వల్ప సంఖ్యలో ఫ్రాన్స్, బ్రిటన్ వద్ద ఉన్నాయి.
ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఆ 9 దేశాలు ఇవే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,187 అణు వార్హెడ్లు ఉన్నాయి. అందులో 9,745 వార్హెడ్లు ఎప్పుడైనా ఉపయోగించేలా సైనిక నిల్వలలో రెడీగా ఉంచారు. సిప్రి అధికారికంగా ప్రకటించిన ఆ 9 అణుదేశాల జాబితా, మోహరించిన ఆయుధాల వివరాలు ఇవే..
రష్యా 1,796 (ప్రపంచంలోనే టాప్)
అమెరికా (USA) 1,770
ఫ్రాన్స్ 280
యునైటెడ్ కింగ్డమ్ (UK) 120
చైనా 34
భారతదేశం 12
పాకిస్థాన్ నిల్వలు ఉన్నాయి (మోహరింపు అంచనా లేదు)
ఉత్తర కొరియా నిల్వలు ఉన్నాయి
ఇజ్రాయెల్ నిల్వలు ఉన్నాయి
ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించుకోవడానికి లేదా తమ జాతీయ శక్తిని చాటుకోవడానికి దౌత్య మార్గాలను పక్కనబెట్టి, అణ్వాయుధాలపై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకర సంకేతమని సిప్రి ఈ సందర్భంగా హెచ్చరించింది.

