Site icon NTV Telugu

జో బైడెన్‌తో నేడు ప్ర‌ధాని మోడీ సమావేశం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం కమలా హ్యారీస్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అమెరికా, భారత్‌ మధ్య సహకారం, సమన్వయం మరింత బలపడ్డాయన్నారు పీఎం. భారత్‌ తమకు అతిముఖ్యమైన భాగస్వామి అన్నారు కమలా హ్యారీస్‌.

అమెరికా, భారత్‌ కలిసి పనిచేస్తే ప్రపంచంపై ప్రభావాన్ని చూపొచ్చన్నారు. కరోనా సమయంలోనూ ఇండో, పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్చ, శాంతిస్థాపనకు కృషి చేశామన్నారామె. భారత్‌లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై హర్షం వ్యక్తం చేశారు కమలా హ్యారీస్‌. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతిని పున: ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు కమలా హ్యారీస్‌. ఇక ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో సమావేశం కానున్నారు మోడీ. అఫ్ఘాన్ పరిణామాల, ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య పెట్టుబడులపై చర్చించనున్నారు. జో బైడెన్‌ ప్రెసిడెంట్ అయ్యాక తొలి సమావేశం ఇదే. ఆ తర్వాత ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌లో జరగనున్న క్వాడ్‌ సదస్సుకు మోడీ హాజరుకానున్నారు. రేపు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 76వ జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించనున్నారు మోడీ.

Exit mobile version