PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్ కోట్ ప్రాంతంలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడి స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. గత కొన్ని రోజులుగా హక్కుల కోసం పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. దీనిని అణచివేయడానికి పాక్ ఆర్మీ, ప్రభుత్వం రక్తపాతానికి పాల్పడుతోంది.
రావల్కోట్ లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో స్థానికులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ సమయంలో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు పౌరులు మరణించారు. మరణించిన వారిలో జాహిద్ ముఘల్, జఫర్ ముఘల్, అర్సలాన్ అక్బర్, వజీద్ హయత్ ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
మరోవైపు, పీఓకే ప్రవాసులు అమెరికాలోని వాషింగ్టన్ వైట్హౌజ్ ముందు నిరసన చేపట్టారు. మహిళలు, చిన్నారులు సహా దాదాపు 100 మందికి పైగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పీఓకే నుంచి పాక్ సైన్యం ఉపసంహరించుకోవాలని, నిరాయుధ ప్రజలపై బలప్రయోగాన్ని నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. పీఓకేలో పాకిస్తాన్ ఇంటర్నెట్ నిలిపేయడం వల్ల 40 లక్షల మంది ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, మానవతా సాయం అందించేందుకు భారత్లోని పూంచ్, దోడా మార్గాలను తెరవాలని పీఓకే ప్రజలు విజ్ఞప్తి చేస్తు్న్నారు.

