Petrol Price Hike: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.. ఇక, పాకిస్థాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారాయి. ఇటీవల లీటరుకు రూ.55 పెంపుతో పెట్రోల్ ధర రూ.321 దాటగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచింది.
ఇంతకు ముందు లీటరుకు సుమారు రూ.100గా ఉన్న సుంకాన్ని ఇప్పుడు రూ.300కు పెంచింది. దీని వల్ల ఈ రకమైన ఇంధనాన్ని ఉపయోగించే వాహనదారులు లీటరుకు అదనంగా రూ.200 చెల్లించాల్సి వస్తుంది.
ధరల పెరుగుదల వివరాలు:
పెట్రోల్ ధర: ₹321.17 / లీటర్
డీజిల్ ధర: ₹335.86 / లీటర్
ఒక్కసారిగా పెంపు: ₹55 / లీటర్
ఇది ఒకే నెలలో రెండోసారి ధరలు పెరగడం గమనార్హం.
కారణాలు ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, అలాగే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా Strait of Hormuz ప్రాంతంలో ఉన్న సంక్షోభం చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కూడా అంతర్జాతీయ చమురు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది.. దేశీయ విమాన టిక్కెట్లు ₹2,800 నుంచి ₹5,000 వరకు పెరిగాయి.. అంతర్జాతీయ టిక్కెట్లు ₹10,000 నుంచి ₹28,000 వరకు పెరిగాయి..
ప్రభుత్వ వివరణ
అయితే, ప్రభుత్వం ప్రకారం, ఈ సుంకం సాధారణ ప్రజలపై నేరుగా భారం పడకుండా, ప్రధానంగా విలాసవంతమైన వాహనాలను ఉపయోగించే వారికి మాత్రమే లక్ష్యంగా పెట్టింది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా పాకిస్థాన్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రపంచ చమురు ధరల పెరుగుదల కలిసి ఇంధన ధరలను చరిత్రలోనే అత్యధిక స్థాయికి తీసుకెళ్లాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.