US-Israel: ఇరాన్ యుద్ధం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను పెంచింది. ఈ పరిణామం తర్వాత అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇజ్రాయిల్ గూఢచర్యంపై తన అధికారుల్ని అలర్ట్ చేసింది. ఇజ్రాయిల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు స్థాయిని ‘‘క్రిటికల్’’కు పెంచింది. నివేదికల ప్రకారం, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇటీవల ఇజ్రాయిల్ గూఢచర్య కార్యకపలాలపై ప్రత్యేక అంచనా నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ఇజ్రాయిల్కు హ్యూమన్ ఇంటెలిజెన్స్, సాంకేతిక నిఘా రంగాల్లో అత్యంత సామర్థ్యం ఉందని పేర్కొంది.
అమెరికా ఉన్నతాధికారులు ఇజ్రాయిల్ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలని పెంటగాన్ సూచించింది. తాత్కాలికంగా ఉపయోగించ బర్నర్ ఫోన్లను, ప్రత్యేక కంప్యూటర్లను, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ విధానాలను అనుసరించడం వంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. హోటల్ గదులు, ఇతర సున్నిత ప్రదేశాల్లో రహస్య అంశాలపై మాట్లాడవద్దని సూచించింది. ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై ట్రంప్ అంతర్గత సమాచారం, నిర్ణయాలను తెలుసుకోవడానికి ఇజ్రాయిల్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేస్తున్నామనేది తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేసింది. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ శత్రుదేశాలపై జరుగుతాయి కానీ, అమెరికా లాంటి మిత్రదేశంపై కాదని చెప్పింది. వైట్ హౌజ్ కూడా ఈ నివేదికల్ని కొట్టిపారేసింది.
ఇరాన్ యుద్ధం అమెరికా, ఇజ్రాయిల్ మధ్య విభేదాలకు కారణమవుతోంది. ట్రంప్ ఇరాన్తో సంధి చేసుకోవాలని భావిస్తుంటే, ఇజ్రాయిల్ మాత్రం యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇద్దరి మధ్య ఒక ఫోన్ సంభాషణ హాట్ హాట్గా సాగినట్లు తెలుస్తోంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంపై వైమానిక దాడులు చేసే ఇజ్రాయిల్ ఆలోచనపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ ప్రతిష్ట దెబ్బతింటుందని ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది.

