Pakistan: పాకిస్తాన్లోని కల్లోలిత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శుక్రవారం ఘోర పేలుడు సంభవించింది. కోహాట్లోని5 ఓల్డ్ పోలీస్ లైన్స్ సమపీంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రధాన గేటును ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తర్వాత కాల్పులు శబ్ధాలు వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని మసీదు వెలుపల భారీ గొయ్యి ఏర్పడింది. మసీదు బయటి భాగం దెబ్బతినడంతో పాటు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి విధించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

