PM Modi-Putin Talks: మోడీ-పుతిన్ భేటీ నేడు.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు

  • మోడీ-పుతిన్ భేటీ నేడు
  • ఎస్-400, యూపీఐ, ఇంధనంపై కీలక చర్చలు
Pm Modi

Pm Modi

PM Modi-Putin Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరగనున్న ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇంధనం, ఎరువులు, రక్షణ, వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థతో పాటు యూపీఐ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇంధనం, ఎరువుల సరఫరాపైనే ప్రధాన దృష్టి

ప్రస్తుతం భారత్‌కు రష్యా కీలక ముడిచమురు సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం, అంతర్జాతీయ ఇంధన సరఫరాల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా కొనసాగడం భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిగిన చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు ఇంధనం, ఎరువుల సరఫరాలో అంతరాయం ఉండదని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ-పుతిన్ భేటీలో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు, చెల్లింపుల విధానాలు, ధరలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

భారత్-రష్యా వాణిజ్య అసమతుల్యతకు పరిష్కారం?

ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరిగినప్పటికీ, రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఇంధనానికి అధిక వాటా ఉంది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో అసమతుల్యత భారత్‌కు ప్రధాన ఆందోళనగా మారింది. భారత ఫార్మాస్యూటికల్స్, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ వస్తువులకు రష్యా మార్కెట్‌లో మరింత అవకాశాలు కల్పించాలని భారత్ కోరుతోంది. 2030 నాటికి భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి.

ఎస్-400పై కీలక చర్చలు

మోదీ-పుతిన్ భేటీలో రక్షణ రంగం కూడా కీలక అంశంగా ఉండనుంది. ముఖ్యంగా భారత్‌కు మిగిలిన ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థల సరఫరా, అదనపు క్షిపణుల అందుబాటు, నిర్వహణ-మరమ్మతు సదుపాయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్‌లోనే ఎస్-400 వ్యవస్థలకు సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయడం, విడిభాగాల సహ-ఉత్పత్తి, రక్షణ పరికరాల స్వదేశీకరణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

యూపీఐ, ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థపై దృష్టి

రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్-రష్యా వాణిజ్య చెల్లింపులు కూడా ముఖ్యమైన అంశంగా మారాయి. ఆంక్షల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను బలోపేతం చేయడంపై చర్చించే అవకాశం ఉంది. భారత్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ యూపీఐకి రష్యాలో మరిన్ని వినియోగ అవకాశాలు కల్పించడం, ద్వైపాక్షిక చెల్లింపులను వేగవంతం చేయడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యత పొందవచ్చు.

అణుశక్తి, టెక్నాలజీ రంగాల్లో సహకారం

భారత్-రష్యా సంబంధాల్లో అణుశక్తి కూడా దీర్ఘకాలిక సహకారానికి కీలక రంగంగా ఉంది. అణు విద్యుత్ ప్రాజెక్టులు, ఎరువుల తయారీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో కొత్త అవకాశాలపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.

అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ

రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసే అవకాశాల మధ్య మోడీ-పుతిన్ సమావేశం జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే, మరోవైపు రష్యాతో తన దీర్ఘకాలిక రక్షణ, ఇంధన, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తోంది.

సెప్టెంబర్‌లో మరోసారి మోడీ-పుతిన్ భేటీ?

బిష్కెక్‌లో జరిగే సమావేశం తర్వాత కూడా ఇరు నాయకులకు మరోసారి ముఖాముఖి చర్చకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్ మరింత విస్తృతంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. మొత్తంగా, బిష్కెక్‌లో మోడీ-పుతిన్ భేటీ కేవలం ద్వైపాక్షిక సంబంధాల సమీక్షకే పరిమితం కాకుండా, ఇంధన భద్రత, ఎరువుల సరఫరా, ఎస్-400, చెల్లింపుల వ్యవస్థ, వాణిజ్య సమతుల్యత, అణుశక్తి, టెక్నాలజీ సహకారం వంటి కీలక రంగాల్లో భారత్-రష్యా భవిష్యత్ సంబంధాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.