Site icon NTV Telugu

Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

Israeliran

Israeliran

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుంది. దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా అయతుల్లా అలీ ఖమేనీ కోసం నిర్మించిన భూగర్భ బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మొసాద్ సాయంతో 50 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు టెహ్రాన్ బంకర్లపై నరకాగ్నిని కురిపించాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్, మొసాద్ సంయుక్తంగా సమర్థవంతమైన సమన్వయంతో దాడులు నిర్వహించిట్లుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

ఈ బంకర్‌ను యుద్ధ సమయంలో తన పర్యవేక్షణ కోసం ఉపయోగించుకొనేందుకు ఖమేనీ నిర్మించారు. ప్రస్తుతం ఖమేనీ మరణం తర్వాత ఈ భవనాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారులు ఉపయోగిస్తున్నారు. ఈ బంకర్‌ను ఇరాన్ తన సైనిక ప్రణాళికల కోసం ఉపయోగించుకోవడానికి… పశ్చిమ దేశాలపై దాడులకు ఉసికొల్పడానికి ఉపయోగిస్తున్నట్లు కనుగొనడంతో ఇజ్రాయెల్ టార్గెట్ చేసి లేపేసింది. ఈ భూగర్భ బంకర్ టెహ్రాన్ నగరంలో పలు వీధుల్లో విస్తరించి ఉంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తులు సమావేశమయ్యే గదుల నుంచి భద్రతా నిబంధనలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. పక్కా సమాచారంతో బంకర్‌ను పేల్చేసినట్లుగా వెల్లడించింది.

ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల, అమెరికా సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు నేలరాలిపోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమరికాకు మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో పశ్చిమాసియా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులు పెరిగి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

Exit mobile version