Iran War: ఇరాన్పై అమెరికా మరోసారి భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యమైన పోర్టులు, రైల్వే వంతెనల్ని కూడా టార్గెట్ చేస్తోంది. అయితే, ఈ దాడుల వెనక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతోనే ట్రంప్ ఆమోదంతో అమెరికా ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని పెంటగాన్కు ఇజ్రాయిల్ సమాచారం ఇచ్చింది. అయితే, ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా ధ్రువీకరించలేదని, ఇజ్రాయిల్ హెచ్చరికలకు ముందు ఎలాంటి నిర్దిష్ట హత్య కుట్రపై తమ వద్ద సమాచారం లేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే, కొందరు అమెరికా అధికారులు మాత్రం ఇరాన్పై సైనిక చర్యలను మరింత తీవ్రం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ ఈ సమాచారాన్ని ఉపయోగించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో, అప్పటి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్లో ఉన్నత జనరల్గా పనిచేసిన ఖాస్సెమ్ సులేమానీ హత్యలో అమెరికా పాత్ర ఉందని, ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చాలా సందర్భాల్లో బెదిరించింది. ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఉరేగింపులో ట్రంప్ను చంపేస్తామని నినాదాలు చేశారు.
ఇటీవల, ట్రంప్ కూడా తన ప్రాణాలకు ఇరాన్ నుంచి ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు, ఇరాన్ యుద్ధం, శాంతి చర్చల తర్వాత ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడిప్పుడే వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కూడా మాట్లాడుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

