పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల 40 రోజుల పాటు జరిగిన యుద్ధంతోనే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు, గ్యాస్ సంక్షోభంతో దేశాలు గిజగిజకొట్టుకుంటున్నాయి. ఆర్థిక సంక్షోభంతో సతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ డేంజర్ సంకేతాలు పంపిస్తున్నాయి. త్వరగా శాంతి ఒప్పందానికి రాకపోతే ఈసారి గట్టి దెబ్బ తగులుతుందని ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు పంపించారు. ఇప్పుడు ఇరాన్ కూడా అంతే ధీటుగా వార్నింగ్లు జారీ చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియా అట్టుడికేటట్టు కనిపిస్తోంది.
అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగితే.. ఈసారి యుద్ధం మధ్యప్రాచ్యాన్ని దాటి మరింత విస్తృతంగా వ్యాపిస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. సెపాహ్ న్యూస్ విడుదల చేసిన ప్రకటనలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) తీవ్ర హెచ్చరికలు చేసింది. ‘‘ఇరాన్పై మళ్లీ దాడులు జరిగితే.. ఈసారి పశ్చిమాసియా ప్రాంతాన్ని దాటి యుద్ధం మరింత విస్తరిస్తుంది. మా విధ్వంసక దాడులు శత్రువులను పూర్తిగా ఛిద్రము చేస్తాయి.’’ అని వార్నింగ్ ఇచ్చింది.
ఈ ప్రకటనకు ముందు ట్రంప్ కూడా ఇరాన్కు తుది గడువు విధిస్తూ హెచ్చరికలు ఇచ్చారు. ‘‘ఇరాన్కు ఒప్పందం చేసుకునేందుకు రెండు లేదా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. శుక్రవారం, శనివారం లేదా వచ్చే వారం ప్రారంభంలో పరిస్థితులు మారొచ్చు’’ అని తెలిపారు. అంతకుముందు గల్ఫ్ దేశాల నాయకుల విజ్ఞప్తితో ఇరాన్పై చేపట్టబోయే తాజా సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అవసరమైతే అమెరికా సైన్యం ఎప్పుడైనా పూర్తి స్థాయి దాడికి సిద్ధంగా ఉందని కూడా హెచ్చరించారు.
ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చలు మంచి పురోగతిలో ఉన్నాయని చెబుతూనే.. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే అమెరికా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
అయితే ఇరాన్ మాత్రం ఇప్పటివరకు తమ పూర్తి సైనిక శక్తిని ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెండు సైన్యాల పూర్తి శక్తితో అమెరికా-జియోనిస్టు బలగాలు మాపై దాడి చేశాయి. అయినా మేము ఇప్పటికీ ఇస్లామిక్ పూర్తి శక్తిని వినియోగించలేదు’’ అని IRGC పేర్కొంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మళ్లీ యుద్ధం మొదలైతే ప్రపంచం ఎన్నో కొత్త షాక్లు చూస్తుంది’’ అని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ సైన్య ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా మాట్లాడుతూ.. ‘‘శత్రువులు మళ్లీ జియోనిస్టుల ఉచ్చులో పడి ఇరాన్పై దాడి చేస్తే.. కొత్త ఆయుధాలు, కొత్త వ్యూహాలతో కొత్త యుద్ధ ఫ్రంట్లను తెరవబోతున్నాం’’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ దాడిలో ఉపయోగించిన డ్రోన్లు ఇరాక్ భూభాగం నుంచి వచ్చినట్లు యూఏఈ వెల్లడించింది. ఈ ఘటనను రష్యా సహా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలు ఖండించాయి. విద్యుత్ జనరేటర్ సమీపంలో పేలుడు సంభవించినప్పటికీ.. ఎలాంటి రేడియేషన్ లీక్ లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు లెబనాన్లో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 19 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ బలగాల మధ్య తాజా ఘర్షణలు కొనసాగుతున్నాయి.
మరొకసారి యుద్ధం మొదలైతే పరిణామాలు మరింత చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడబోనుంది. ఇప్పటికే ఆయా దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. మరోసారి యుద్ధం మొదలైతే మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా కీలక నేతలంతా నేలరాలిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయినా కూడా ఏ మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇరు దేశాలు హెచ్చరించుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్నింగ్లు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
