Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?

  • అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్
  • ఎలాంటి ఒప్పందం చేసుకోవడం లేదని వెల్లడి
  • మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు
Usiran

Usiran

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగొచ్చని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనవచ్చని.. పరిస్థితులు తిరిగి నార్మల్ స్థితికి రావొచ్చని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం కాబోతున్నట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెరికాతో ఎలాంటి ఒప్పందానికి ఇప్పట్లో సంతకం చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. చర్చలను పూర్తిగా రద్దు చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తప్పవన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇరాన్ ప్రభుత్వ అనుబంధ టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. అమెరికాతో జరుగుతున్న అణు చర్చల్లో ఎలాంటి అణు రాయితీలు ఇవ్వలేదని, యురేనియం అప్పగింతకు కూడా అంగీకరించలేదని స్పష్టం చేసింది. “అమెరికాతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడం లేదు. ఒప్పందం కుదిరే దశలో ఉన్నామని ఎవరూ చెప్పలేరు” అని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ కూడా మాట్లాడుతూ.. “చర్చల్లో అనేక అంశాలపై పురోగతి సాధించాం. కానీ త్వరలోనే ఒప్పందం కుదురుతుందని చెప్పడం సరైంది కాదు” అని వ్యాఖ్యానించారు. అమెరికాతో కుదురనున్న ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ఎలాంటి కొత్త నిబందనలు లేవని తెలిపారు. యురేనియం బదిలీ అంశం ఉందన్న వార్తలను పూర్తిగా అబద్ధంగా కొట్టిపారేశారు.

మరోవైపు ట్రంప్ కూడా ఇటీవల ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే అది సరైన, బలమైన ఒప్పందమే అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు ముగియలేదు” అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అలాగే ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్‌లో అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇదే అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పందిస్తూ.. “ఇరాన్ అణు ముప్పును పూర్తిగా తొలగించే విధంగానే తుది ఒప్పందం ఉండాలి” అని ట్రంప్‌తో ఏకీభవించినట్లు తెలిపారు. ఇక యురేనియం శుద్ధి కార్యక్రమమే ప్రస్తుతం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. అణ్వాయుధాల తయారీకి అవకాశం లేకుండా ఇరాన్‌పై కఠిన పరిమితులు విధించాలని అమెరికా, ఇజ్రాయెల్ పట్టుబడుతున్నాయి. అయితే తమ రెడ్ లైన్స్ దాటే ఒప్పందాలకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

ఇక హార్ముజ్ జలసంధి అంశం కూడా రెండు దేశాల మధ్య మరో వివాదంగా మారింది. ఆ ప్రాంతంలో నౌకాయాన సేవలకు సంబంధించి ఇరాన్ వసూలు చేస్తున్న రుసుములను అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే పర్యావరణ పరిరక్షణ, నౌకాయాన భద్రత కోసం ఆ రుసుములు అవసరమని ఇరాన్ సమర్థించుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్, చైనా కూడా ఈ చర్చల్లో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ప్రపంచం కీలక దశలో ఉందని, శాంతి దిశగా చైనా సహకారం కీలకమని షరీఫ్ వ్యాఖ్యానించారు.

అయితే ఇరాన్-అమెరికా చర్చలపై వస్తున్న ప్రతీ వార్తకు అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన వార్తలతో చమురు ధరలు తగ్గినా.. తాజా ఇరాన్ వ్యాఖ్యలతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలపై ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.