ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు. టెహ్రాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో పెజెష్కియన్ మాట్లాడారు. ‘యుద్ధం కాదు.. శాంతి కాదు’ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే దేశ గౌరవం, సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును సంక్షోభాలు, తుఫాన్ల నుంచి కాపాడేలా గౌరవప్రదమైన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇటీవల మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా సమస్యల పరిష్కారానికి చర్చలు, సంభాషణలకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు.
“యుద్ధం దేశ ప్రయోజనాల్లో లేదు. కానీ మా గౌరవాన్ని, భూమిని, సార్వభౌమాధికారాన్ని ఎవరైనా ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే మేము లొంగిపోము” అని పెజెష్కియన్ హెచ్చరించారు. యుద్ధ పరిస్థితులు, వరుస సంక్షోభాల మధ్య దేశ పరిపాలన చాలా క్లిష్టమైందని పేర్కొంటూ.. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాజకీయ వ్యవస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్
పెజెష్కియన్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బుధవారం ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇరాన్ చర్చలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. “ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది. వారికి అనుకూలమైన ఒప్పందాన్ని చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సిందే” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఒకరోజు క్రితమే చర్చలు చివరి దశలో ఉన్నాయని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు మరింత కఠిన వైఖరి అవలంబించడం గమనార్హం.
మళ్లీ సైనిక ఉద్రిక్తతలు
దౌత్యపరమైన ఉద్రిక్తతలతో పాటు సైనిక ఘర్షణలు కూడా మళ్లీ ముదిరాయి. అమెరికా దళాలు ఇరాన్లోని కొన్ని లక్ష్యాలపై దాడులు జరిపిన తర్వాత.. ప్రతీకారంగా జోర్డాన్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, భూభాగ నియంత్రణ సదుపాయాలపై దాడులు నిర్వహించారు. ఈ చర్యలు అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా చేపట్టినవని అమెరికా తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ తన గగనతలంలోకి వచ్చిన పలు వైమానిక లక్ష్యాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. జోర్డాన్ సైన్యం ఐదు క్షిపణులను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. కువైట్ కూడా శత్రు వైమానిక లక్ష్యాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ శాఖ పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ తమ భూభాగాలను ఇరాన్పై సైనిక చర్యలకు ఉపయోగించకుండా అడ్డుకోవడం ప్రాంతీయ దేశాల “చట్టపరమైన, నైతిక బాధ్యత” అని పేర్కొంది.
అంతర్జాతీయ ఆందోళన
తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఈ కొత్త అమెరికా-ఇరాన్ సైనిక ఘర్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. చైనా కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
లెబనాన్ అంశమే ప్రధాన అడ్డంకి
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు లెబనాన్ అంశం కూడా ప్రధాన అడ్డంకిగా మారింది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నంత వరకు శాశ్వత ఒప్పందం సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. బుధవారం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. టైర్ నగరానికి ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాంతాన్ని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో “యుద్ధం కాదు.. శాంతి కాదు” అనే పరిస్థితిని ముగించాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న విభేదాలు చూస్తే త్వరలో శాశ్వత పరిష్కారం లభించడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

