Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య అవగాహన కుదిరింది. ఈ రెండు దేశాల మధ్య గత మూడు వారాలుగా జరిగిన చర్చల అనంతరం సురక్షిత నౌకాయానానికి సంబంధించిన మార్గంపై ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.
అయితే హార్ముజ్ జలసంధిని పూర్తిగా సాధారణ రాకపోకలకు తెరవడంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా విధించిన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం వంటి అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్-ఒమన్ మధ్య నౌకలకు సురక్షిత మార్గం ఏర్పాటు అంశం, హార్ముజ్ను పూర్తిగా తిరిగి తెరవడం అనే అంశం వేర్వేరని బఘాయీ పేర్కొన్నారు.
ట్రంప్కు ఇరాన్ గట్టి కౌంటర్
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా విజయం సాధించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు సరదాగా చేసినవేనని వైట్హౌస్కు చెందిన ఓ అధికారి తర్వాత పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధి తమదేనని, ఇకపై కూడా తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్ ఘరీబాబాదీ స్పష్టం చేశారు. “హార్ముజ్ జలసంధి ఇరాన్దే.. జలసంధిని ఎప్పుడు మూసివేయాలి, ఎప్పుడు తెరవాలి అనే నిర్ణయం ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందని పేర్కొన్నారు.
ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ కీలకం
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. పెర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో అనుసంధానించే ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఇంధన సరఫరాలో భారీగా రవాణా జరుగుతుంది. అందుకే ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం లేదా పరిమితం కావడం ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా హార్ముజ్ను అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు తెరవాలని కోరుతోంది. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా విధించిన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం సహా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు జలసంధిని పూర్తిగా సాధారణ రాకపోకలకు తెరవబోమని చెబుతోంది.
ఇరాన్-ఒమన్ ఒప్పందం ఏం చెబుతోంది?
ఇరాన్, ఒమన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ప్రధానంగా నౌకలకు సురక్షిత మార్గాన్ని గుర్తించడంపై ఉంది. రెండు దేశాలు ఇప్పటికే నౌకల రాకపోకలకు సంబంధించిన ఒక “షిప్పింగ్ మ్యాప్”పై అంగీకరించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే సాంకేతిక చర్చలు, సంయుక్త ప్రకటన వంటి కొన్ని అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ ఒప్పందం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకున్నట్లు అర్థం కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సురక్షిత నౌకాయానానికి మార్గం ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయా?
హార్ముజ్ నియంత్రణపై అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్-ఒమన్ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అవగాహన వాణిజ్య నౌకలకు కొంత ఊరట కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, హార్ముజ్ పూర్తిస్థాయి పునఃప్రారంభానికి అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ప్రధాన వివాదాలు పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరాన్ తన డిమాండ్లపై గట్టిగా నిలబడుతుండగా, అమెరికా హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కోరుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఏ దిశగా సాగుతాయన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

