Site icon NTV Telugu

Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Israel

Israel

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అయితే ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవరూ రైళ్లను ఉపయోగించవద్దని.. అంతేకాకుండా రైల్వే లైన్ల సమీపానికి కూడా ఎవరూ వెళ్లొద్దని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇరానీయుల భద్రత దృష్ట్యా రైళ్లను ఉపయోగించొద్దని కోరింది. ఇరాన్ అంతటా రైళ్లను ఉపయోగించడం గానీ, ప్రయాణించడం గానీ తక్షణం మానుకోవాలని సూచించింది. దయచేసి అర్థం చేసుకోవాలని… వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు ఎక్స్‌లో ఇజ్రాయెల్ సైన్యం కోరింది. పర్షియన్ భాషా ఖాతాలో ఇజ్రాయెల్ పోస్ట్ చేసినట్లుగా రాయిటర్స్ పేర్కొంది.

ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని ఆ దేశ మెహర్ వార్తా సంస్థతో పాటు షర్గ్, హమ్-మిహాన్ పత్రికలు తెలిపాయి. ఇరాన్‌లోని షిరాజ్‌లో పెట్రోకెమికల్ యూనిట్‌పై ఐడీఎఫ్ దాడి చేసింది. ‘‘ఈ ప్లాంట్ పేలుడు పదార్థాలు, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి ప్రక్రియల్లో అదనపు సామగ్రిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థమైన నైట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి ఇరాన్ సాయుధ దళాలకు ఉపయోగపడుతుంది.’’ అని ఐడీఎఫ్ తెలిపింది.

 

Exit mobile version