పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణినే కారణంగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదట నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ను చేరుకునే క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోందని ట్రంప్, నెతన్యాహు ఆరోపిస్తూ వచ్చారు. అన్నట్టుగానే తాజాగా ఆ అనుమానం నిజమైంది.
హిందూ మహా సముద్రంలోని చాగోస్ దీవుల్లోని డియాగో గార్సియాలో ఉన్న అమెరికా-బ్రిటన్కు సంయుక్తంగా ఉన్న సైనిక స్థావరంపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే రెండింటిలో ఏ క్షిపణి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదు. ఒకటి మార్గమధ్యలో విఫలం కాగా.. ఇంకొక క్షిపణిని అమెరికా యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఇంటర్సెప్టర్ అడ్డుకుంది. అయితే బాలిస్టిక్ క్షిపణి ఏమైంది? అనేది స్పష్టత రాలేదు. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ తన కథనంలో పేర్కొంది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఇరాన్ భూభాగం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరానికి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 2,000-3,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల క్షిపణులు మాత్రమే ఉన్నాయని ప్రపంచం భావించింది. కానీ తాజా ఘటనతో టెహ్రాన్ దగ్గర 4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదింగల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తేలిపోయింది. ఈ పరిణామం పశ్చిమ దేశాలను మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా పెంటగాన్ స్పందించలేదు. ఏ అధికారి కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం.. ఇరాన్ దక్షిణాసియాను కూడా ఛేదించగలదని అర్థమవుతోంది.
ప్రస్తుత యుద్ధాన్ని ఇరాన్ మరింత తీవ్రతరం చేసి పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ సందేశం పంపే అవకాశం ఉందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
