US-Iran War: మిడిల్ ఈస్ట్ పరిస్థితులు విషమిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకుంటున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాదులు చేసింది. వరసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని నిఘా కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్, భూగర్భ ఆయుధ నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు శనివారం తెల్లవారుజామున యూఎస్ సెంట్రల్ కమాండ్ నివేదించింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. జోర్డాన్లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. అయితే, ఈ దాడిలో పలువురు అమెరికన్ సైనికులు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిని యూఎస్ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము కొత్తగా దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) శుక్రవారం ప్రకటించింది. సిరియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్లోని లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐఆర్జిసి పేర్కొంది. అమెరికా పెట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఈ దాడుల్ని అడ్డుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది.
జోర్డాన్లోని యూఎస్ స్థావరాలపై దాడులు:
జోర్డాన్లోని రాయల్ జోర్డాన్ వైమానిక దళానికి చెందిన మువఫ్పాక్ సాల్టి వైమానిక స్థావరంలో అమెరికా ప్రధాన సైనిక స్థావరం ఉంది. ఇందులో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, సహాయక దళాలు ఉన్నాయి. ఇటీవల దీనిని ఇరాన్పై జరగబోయే కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. టవర్ 22 అనే ఒక చిన్న సైనిక స్థావరం ఈశాన్య జోర్డాన్లో, సిరియా సరిహద్దుకు సమీపంలో ఉంది. ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, కింగ్ ఫైసల్ ఎయిర్ బేస్, ఇంకా అనేక ఇతర శిక్షణా మరియు సరిహద్దు స్థావరాలలో కూడా అమెరికా సైనికులు ఉన్నారు. జోర్డాన్లో మొత్తం 3000-4000 మంది యూఎస్ సైనికులు మోహరించి ఉన్నారు. శనివారం జోర్డాన్లోని రెండు స్థావరాలైన మువఫ్పాక్ సల్టీ ఎయిర్ బేస్, ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేసింది.
కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై దాడి:
ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లలో దాడులు చేస్తోంది. ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై విరుచుకుపడుతోంది. ఈ దాడివలో ఫైటర్ జెట్ కమాండ్ సెంటర్, డ్రోన్ హ్యాంగర్లు దెబ్బతిన్నట్లు ఇరాన్ చెబుతోంది. కువైట్లోని క్యాంప్ అల్-ఉదైరి, అలీ అల్-సలేం ఎయిర్ బేస్, జోర్డాన్లోని అల్-అజ్రాక్ ఎయిర్ బేస్, మరియు బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. తమ దాడుల వల్ల అమెరికన్ సైనికులకు ప్రాణనష్టం జరిగినట్లు ఇరాన్ చెబుతోంది.

