Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు

  • ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
  • ఊహించినంత సులభంగా లేవని వెల్లడి
  • జీ7 సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య విభేదాలు
Melonitrump

Melonitrump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంబంధాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో తన సంబంధాలు తాను ఊహించినంత సులభంగా లేవని తేల్చి చెప్పారు. వలసలు, ‘వోక్ కల్చర్’ వంటి అంశాల్లో తమ ప్రభుత్వాల మధ్య సారూప్యతలు ఉన్నందున ట్రంప్‌తో కలిసి పనిచేయడం సులభంగా ఉంటుందని తొలుత భావించానని తెలిపారు.

‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలోని తన అభిప్రాయాలను వెల్లడించారు. “డొనాల్డ్ ట్రంప్‌తో విషయాలు మరింత సులభంగా ఉంటాయని నేను అనుకున్నాను. వలసలు, వోక్ కల్చర్ వంటి అంశాల్లో మా అభిప్రాయాలు దగ్గరగా ఉండటమే అందుకు కారణం. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి” అని ఆమె పేర్కొన్నారు.

ఇటీవల జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్.. తనతో ఫొటో దిగాలని మెలోని బతిమిలాడారని వ్యాఖ్యానించడంతో ఇరువురు నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెలోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపారు. “నేను కానీ.. ఇటలీ కానీ ఎవరినీ బతిమాలుకోం” అని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగింది?

ఇటలీకి చెందిన లా7 టెలివిజన్ ప్రసారం చేసిన వ్యాఖ్యల ప్రకారం.. జీ7 సదస్సులో మెలోనితో తాను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమెతో మాట్లాడటం కేవలం జాలితోనే జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో ఫొటో దిగాలని మెలోని చాలా పట్టుబట్టారని ట్రంప్ చెప్పినట్లు లా7 వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యలు డబ్బింగ్ చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా ప్రసారం కాగా.. అసలు ఆడియోను ఛానల్ విడుదల చేయలేదు.

ఒకప్పుడు యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత బలమైన మద్దతుదారుల్లో మెలోని ఒకరు. 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నేతగా కూడా ఆమె నిలిచారు. అయితే ఇరాన్ యుద్ధానికి సంబంధించి పోప్ లియోపై ట్రంప్ చేసిన విమర్శలను మెలోని తప్పుబట్టడంతో ఇద్దరి మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. దీనిపై ట్రంప్ కూడా మెలోనిపై విమర్శలు గుప్పిస్తూ ఆమెకు ధైర్యం లేదంటూ వ్యాఖ్యానించారు. జీ7 సదస్సు సమయంలో ఇరువురు నేతలు విభేదాలను పక్కన పెట్టినట్లు కనిపించినప్పటికీ.. తాజాగా ఫొటో వివాదం, మెలోని చేసిన వ్యాఖ్యలతో వారి మధ్య సంబంధాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.