Nepal Elections: ‘‘జెన్ Z’’ ఉద్యమం తర్వాత నేపాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ప్రధానమంత్రి అభ్యర్థి బాలెన్ షా ఘన విజయం సాధించారు. నేపాల్ కాబోయే ప్రధానిగా బాలెన్ షా ఉన్నారు. నేపాల్ యువతలో క్రేజ్ కలిగిన ఈ మాజీ రాపర్, సింగర్ ఇప్పుడు నేపాల్ దశాదిశను నిర్ణయించబోతున్నారు. ఝాపా జిల్లాలోని 5వ నియోజకవర్గం నుంచి బాలెన్ షా విజయం సాధించారు. నేపాల్ మాజీ ప్రధాని, జెన్ జీ యువత ఉద్యమం తర్వాత నేపాల్ ప్రధానిగా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా 50,000 ఓట్ల తేడాతో ఓలిపై బాలెన్ షా గెలిచారు.
తుది ఓట్ల ఫలితాల ప్రకారం, బాలెన్ షా మొత్తం 68,348 ఓట్లు సాధించగా, కె.పి. శర్మ ఓలి ఈ నియోజకవర్గంలో దాదాపు 18,000 ఓట్లు సాధించారు. అందువల్ల, ఇద్దరు అభ్యర్థుల మధ్య దాదాపు 50,000 ఓట్ల తేడా ఉంది. ఓలి భారత్ వ్యతిరేకిగా పేరుంది. తన పాలనలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. భారత్తో సంబంధాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టలేదని కామెంట్స్ చేశారు. ఇక భారత్లో అంతర్భాగంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవే అని చెప్పుకున్నారు.
275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రత్యక్షంగా ఎన్నికైన 165 స్థానాల్లో RSP 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బాలెన్ షా ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను నేపాల్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఆర్ఎస్పీ తర్వాత రెండో స్థానంలో నేపాల్ కాంగ్రెస్ 15 సీట్లతో ఉంది. ఓలీ పార్టీ 10 లోపు స్థానాలకే పరిమితమై ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. నేపాల్ ప్రజాస్వామ్య చరిత్రలో 36 ఏళ్ల లో మొదటిసారిగా ఒక పార్టీకి నేపాల్ ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టారు.