పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో చమురు ట్యాంక్లన్నీ నిలిచిపోయాయి. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాప్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం అప్రమత్తం అయింది.
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోందని చైనా గ్యాస్ కొనుగోలుదారులు చెబుతున్నారు. ఖతార్ గ్యాస్ ఎగుమతులు, అలాగే హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇతర ఇంధన రవాణాకు అంతరాయం కలిగించే చర్యలను తక్షణమే నివారించాలని ఇరాన్ అధికారులపై చైనా ఒత్తిడి తెస్తోందని సీనియర్ గ్యాస్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో 700లకు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఇరాన్ జరిపిన దాడితో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద LNG ఎగుమతి సౌకర్యం అయిన రాస్ లఫాన్లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపించనుంది.
ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు రెండు వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
