ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే.. మూడు దేశాలు శత్రువుపై దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ఇటీవల మక్కా వేదికగా ఈ మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. తాజాగా ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందంలోకి బంగ్లాదేశ్ కూడా చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. టర్కీ మీడియాలో కథనం హల్చల్ చేస్తోంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగానే బంగ్లాదేశ్ కూడా చేరవచ్చని కథనంలోని సారాంశం. భారత్ను ఎదుర్కొనేందుకు టర్కీ కుట్ర చేస్తున్నట్లుగా ఈ కథనంతో అర్థమవుతోంది.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు మక్కా ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే టర్కీ వార్తాపత్రిక ‘యెని షఫాక్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. కూటమిలో బంగ్లాదేశ్ చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనిపై చర్చ జరిగినట్లుగా వెల్లడించింది. వ్యాసంలో రచయిత పేరును పేర్కొనలేదు. ఈ చర్య భారతదేశానికి ఆగ్రహం తెప్పిస్తుందని తెలిపింది.
వాస్తవానికి ఇది మీడియా కథనమే అయినప్పటికీ ‘యెని షఫాక్’ అనేది సాధారణ వార్తాపత్రిక కాదు. టర్కీ ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉండే తీవ్రవాద పత్రిక. భారతదేశంపై టర్కీ అతిగా దృష్టి పెట్టడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారతదేశంలో చిన్న చిన్న సమస్యలను ఎత్తి చూపుతూ.. భారత్ను అపహాస్యం చేసేందుకు టర్కీ పూనుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో వార్తా పత్రిక భారత నాయకులను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి కూడా వెనుకాడదని తెలుస్తోంది. 2024 నుంచి ఈ వార్తాపత్రిక బంగ్లాదేశ్లోని తిరుగుబాటుదారులకు బహిరంగ మద్దతి ఇస్తూ వస్తోంది. షేక్ హసీనాను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది భారత్ వ్యతిరేక వైఖరిలో భాగంగానే ఇదంతా జరిగింది. దీంతో యెనీ షఫాక్ కథనాన్ని పూర్తిగా నిరాధారమైనదిగా కొట్టిపారేయలేం.
ఎలాగైనా ఇస్లామిక్ నాటో కూటమిలోకి బంగ్లాదేశ్ను చేర్చుకోవాలని టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కథనంలో తెలిపింది. పాకిస్థాన్తో ఉన్న సంబంధాలనే బంగ్లాదేశ్తో కొనసాగించాలని టర్కీ భావిస్తున్నట్లుగా సమాచారం.
తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. సౌదీతో భారత్కు మంచి ఒప్పందం ఉంది. దీంతో సౌదీతో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ ఈ ఒప్పందం ద్వారా టర్కీ అత్యధిక ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్కు టర్కీ బహిరంగంగా మద్దతు తెల్పడమే కాకుండా ఆయుధాలు కూడా సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

