రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. మిగతా 299 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: గులాబీని గట్టిగా కొడితేనే తెలంగాణలో కమల వికాసమా..?
తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ఎన్నికల్లో ముందస్తు ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దాని మిత్రపక్షం, షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఇ-ఇస్లామి(జేఐఐ) వెనుకంజలో ఉంది. రాజకీయ విశ్లేషకుడు డేనియల్ రెహమాన్ ప్రకారం బీఎన్పీ విజయం సాధించవచ్చని అంచనా వేశాడు. ఆగస్టు 2024లో విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన హింస కారణంగా 15 ఏళ్ల హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమన్ లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చాడు.
ఇక ఈసారి ప్రతి ఓటరు 2 ఓట్లు వేయనున్నారు. ఒకటి ఎన్నికల కోసం కాగా.. ఇంకొకటి రాజ్యాంగం మార్పు కోసం ఓటు వేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం తెల్ల బ్యాలెట్ పత్రాలు ఉండగా.. రాజ్యాంగ సవరణ కోసం గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేశారు.